CWC 2023: ప్రపంచకప్లో తమ జట్టు ఘోర వైఫల్యమో లేక భారత్ బాగా ఆడుతుందన్న అక్కసో తెలియదు గానీ టీమిండియా విజయాలు పాకిస్తాన్ క్రికెట్ అభిమానులకు, మాజీ ఆటగాళ్లకు నిద్రలేని రాత్రులను మిగుల్చుతున్నాయి. ఈ ఫ్రస్ట్రేషన్లో ఏం మాట్లాడుతున్నారో ఎందుకు కామెంట్స్ చేస్తున్నారో అర్థం కాని పరిస్థితుల్లో చిత్రవిచిత్రమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. నిన్నామొన్నటిదాకా వరల్డ్కప్లో భారత బౌలర్లకు బీసీసీఐ ప్రత్యేక బంతులనిస్తుందని హసన్ రాజా అనే మాజీ క్రికెటర్ కామెంట్స్ చేయగా తాజాగా సికందర్ బఖ్త్ అనే మరో మాజీ క్రికెటర్.. రోహిత్ శర్మ టాస్ వేయడంలోనే అసలు కుట్ర దాగి ఉందని అంటున్నాడు.
వరల్డ్ కప్ సెమీస్లో భారత్ న్యూజిలాండ్ను ఓడించిన తర్వాత సికందర్ జియో న్యూస్తో మాట్లాడుతూ… ‘నేను మీకు టాస్ సందర్భంగా జరుగుతున్న కుట్రను వివరించనా..? సాధారణంగా ఈ మెగా టోర్నీలో టాస్ వేస్తున్నప్పుడు మిగతా సారథులంతా తమకు దగ్గరగానే కాయిన్ విసురుతున్నారు. కానీ రోహిత్ మాత్రం వాళ్లు నిలుచున్న స్థానాలకు ముఖ్యంగా అపోజిషన్ కెప్టెన్కు చాలా దూరం విసురుతున్నాడు. దాంతో ప్రత్యర్థి సారథి వెళ్లి దానిని క్రాస్ చెక్ చేయడం లేదు. రిఫరీలు కూడా భారత్కు అనుకూలంగా వ్యవహరిస్తున్నారు’ అని వ్యాఖ్యానించాడు.
Very strange the way Rohit Sharma throw the coin at toss, far away, don’t let other Captains to see, compare to other Captains in the WC , any reason?? @BCCI @TheRealPCB @CricketAus @CricketSouthAfrica #sikanderbakht #WorldCup23 #IndiaVsNewZealand @ImRo45 @ICC pic.twitter.com/KxhR2QyUZm
— Sikander Bakht (@Sikanderbakhts) November 15, 2023
భారత్లో జరుగుతున్న వన్డే ప్రపంచకప్లో టాస్ కీలకపాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా టాస్ గెలిచిన సారథి మరో మాట లేకుండా మొదట బ్యాటింగ్ వైపునకే మొగ్గుచూపుతున్నాడు. బుధవారం కివీస్తో మ్యాచ్లో కూడా టాస్ కీలక పాత్ర పోషించింది. అయితే టాస్ గెలిచిన సారథులందరూ మ్యాచ్లూ గెలవలేదు. ఈ విషయాన్ని సికందర్ మరిచిపోయాడు. సికందర్ కామెంట్స్పై టీమిండియా ఫ్యాన్స్ కూడా మండిపడుతున్నారు. ప్రపంచంలో ఎవరికీ రాని దిక్కుమాలిన ఐడియాలన్నీ పాకిస్తాన్ క్రికెటర్లకే వస్తాయని వాపోతున్నారు. తమ జట్టు ఓడిపోయిందనే బాధలో ఇతర జట్లపై అబాంఢాలు మోపుతున్నారని మండిపడుతున్నారు.
భారత అభిమానులే కాదు పలువురు పాకిస్తాన్ మాజీలు కూడా ఈ టాస్ కుట్ర థీయరీని తీవ్రంగా తప్పుబడుతున్నారు. వసీం అక్రమ్, షోయభ్ మాలిక్, మోయిన్ ఖాన్లు సికందర్ చేసిన కామెంట్స్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ..‘అసలు కాయిన్ ఎక్కడ పడాలన్నది ఎవరు డిసైడ్ చేస్తారు.? అతడి కామెంట్స్ చూస్తుంటే నాకే జిగుప్సాకరంగా ఉంది. నేను దీనిపై ఏ కామెంట్స్ చేయదలుచుకోలేదు..’ అని అక్రమ్ చెప్పగా ‘అతడు చెప్పేది చాలా తప్పు. ఏదో జనాల అటెన్షన్ తనమీద ఉండాలని వాగుతున్నాడు తప్ప అందులో ఏమీ లేద’ని మోయిన్ ఖాన్ అన్నాడు. షోయభ్ మాలిక్ అయితే ‘అసలు దీని గురించి చర్చించడం వేస్ట్’ అని చెప్పడం గమనార్హం.