లండన్: యాభై ఐదేండ్ల నిరీక్షణకు తెరపడింది. 1966 తర్వాత మొదటిసారిగా ఇంగ్లండ్ ఓ మేజర్ టోర్నీలో ఫైనల్కు చేరింది. వచ్చే ఆదివారం జరగనున్న యూరో 2020 ఫైనల్లో ఇటలీతో తలపడనుంది. డెన్మార్క్తో ఉత్కంఠభరితంగా జరిగిన సెమీఫైనల్లో ఇంగ్లండ్ 2-1తో చారిత్రక విజయం సాధించింది. ఆట ప్రారంభమైన 30 నిమిషాల తర్వాత మొదటి గోల్ నమోదయింది. డెన్మార్క్ ఆటగాడు మైకెల్ డామ్స్గార్డ్ తన జట్టుకు గోల్ సాధించిపెట్టాడు. దీంతో ఆ జట్టు 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.
ఆట హోరాహోరీగా సాగుతున్న క్రమంలో డెన్మార్క్ ప్లేయర్ సైమన్ జైర్ చేసిన పొరపాటుకు ఆ జట్టు తగిన మూల్యం చెల్లించుకున్నది. మ్యాచ్ 90వ నిమిషంలో సైమన్.. సెల్ఫ్గోల్ చేయడంతో ఇంగ్లండ్ ఖాతా తెరిచినట్లయింది. దీంతో ఇరు జట్ల స్కోర్ సమం అయ్యింది.
సమయం ముగిసినప్పటికీ ఫలితం తేలకపోవడంతో నిర్వాహకులు అదనపు సమయం కేటాయించారు. దీంతో 14వ నిమిషం వద్ద ఇంగ్లండ్ ఆటగాడు హెర్రీ కేన్ తనకు లభించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. ఫెనాల్టీ కిక్ను గోల్గా మలచిన హెర్రీ.. తన జట్టుకు మరపురాని విజయాన్ని సాధించిపెట్టాడు. దీంతో ఇంగ్లండ్ జట్టు 56 ఏండ్ల కళ ఫలించినట్లయింది. మొదటిసారిగా ఓ ప్రముఖ టోర్నీలో ఫైనల్లో తలపడనుంది. వచ్చే ఆదివారం వెంబ్లే స్టేడియంలో ఇటలీతో అమీతుమీ తేల్చుకోనుంది.