BCCI : సుదీర్ఘ ఫార్మాట్లో ఆడే క్రికెటర్లకు సెంట్రల్ కాంట్రాక్ట్లు కట్టబెట్టిన బీసీసీఐ (BCCI) మరో నిర్ణయం తీసుకుంది. అబ్బాయిలతో పాటు అమ్మాయిలు కూడా దేశవాళీ క్రికెట్(Domestic Cricket) ఆడాల్సిందేనని స్పష్టం చేసింది. సెంట్రల్ కాంట్రాక్ట్ ఉన్న ఆటగాళ్లు సైతం రంజీల్లో ఆడాలని తేల్చి చెప్పిన బీసీసీఐ మహిళా క్రికెటర్లు (Women Cricketers) మరింత రాటుదేలేందుకు ‘రెడ్ బాల్ క్రికెట్ టోర్న’ ప్లాన్ చేస్తోంది.
డబ్ల్యూపీఎల్ రెండో సీజన్ ముగిశాక ఈ టెస్టు టోర్నమెంట్ నిర్వహించనుంది. మొత్తం ఆరు జోన్ల జట్లు తలపడే ఈ టోర్నీ మార్చి 29న షురూ కానుంది. ఈస్ట్, వెస్ట్, నార్త్, సెంట్రల్, సౌత్, నార్త్ ఈస్ట్ జోన్లు ఈ టోర్నీలో అమీతుమీ తేల్చుకోనున్నాయి. రెండు క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లను మార్చి 29, 30, 31వ తేదీల్లో ఆడిస్తారు. సెమీ ఫైనల్ మ్యాచ్లు ఏప్రిల్ 5, 6, 7వ తేదీల్లో.. ఫైనల్ మ్యాచ్ను ఏప్రిల్ 9, 10, 11వ తేదీల్లో నిర్వహించనున్నారు.
టెస్ట్ సిరీస్ ట్రోఫీతో భారత జట్టు
ఈ ఏడాది ఆరంభంలో భారత మహిళల జట్టు రెండు టెస్టు సిరీస్లు ఆడింది. స్వదేశంలో ఇంగ్లండ్, ఆస్ట్రేలియాతో ఏకైక టెస్టు మ్యాచ్లో భారీ తేడాతో గెలిచింది. సుదీర్ఘ ఫార్మాట్లో రికార్డు విజయంతో హర్మన్ప్రీత్ సేన చరిత్ర సృష్టించింది. దాంతో, మహిళా క్రికెటర్లను దేశవాళీలో మరిన్ని మ్యాచ్లు ఆడించాలనే ఉద్దేశంతో బీసీసీఐ ఉంది. అందుకనే రంజీ ట్రోఫీ మాదిరిగా టెస్ట్ టోర్నమెంట్ను నిర్వహించనుంది. డబ్ల్యూపీఎల్ రెండో సీజన్ మార్చి 17న ముగిస్తుంది. ఆ తర్వాత పది 12 రోజులకే రెడ్ బాల్ టోర్నీ షురూ కానుంది.