Nita Ambani | రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత, అపర కుబేరుడు ముకేశ్ అంబానీ (Mukesh Ambani ) ఇంట పెళ్లి సందడి మొదలైంది. ముకేశ్ అంబానీ-నీతా అంబానీ (Nita Ambani ) చిన్న కుమారుడు అనంత్ అంబానీ (Anant Ambani ) వివాహం రాధిక మర్చంట్ (Radhika Merchant)తో జులై 12న జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా అంబానీ ఇంట ప్రీ వెడ్డింగ్ వేడుకలు షురూ అయ్యాయి. ఈ ముందస్తు వివాహ వేడుకలను గుజరాత్ (Gujarat)లోని జామ్నగర్ (Jamnagar)లో నిర్వహిస్తున్నారు. ఇప్పటికే అంబానీ ఫ్యామిలీ మొత్తం జామ్నగర్ చేరుకుంది. ఇక అతిథులు సైతం ఒక్కొక్కరుగా జామ్నగర్ చేరుకుంటున్నారు. మూడు రోజుల పాటు జరిగే ఈ ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో జాతీయ, అంతర్జాతీయ ప్రముఖులు పాల్గొనబోతున్నారు.
ఇక వేడుకల ప్రారంభం సందర్భంగా ముకేశ్ అంబానీ సతీమణి నీతా అంబానీ ప్రత్యేక వీడియో సందేశానిచ్చారు. ఈ పెళ్లి విషయంలో తనకు రెండు ముఖ్యమైన కోరికలు ఉన్నట్లు చెప్పారు. అందులో ఒకటి తమ మూలాలను గుర్తించుకునేలా వేడుకలను ఘనంగా నిర్వహించాలనుకుంటున్నట్లు తెలిపారు. ఇంకోటి.. ఈ వేడుక మన కళలు, సంస్కృతి, దేశ వారసత్వాన్ని ప్రతిబింబించేలా ఉండాలని తాము కోరుకున్నట్లు వివరించారు.
#WATCH | Jamnagar, Gujarat | Founder and chairperson of Reliance Foundation Nita Ambani speaks on the pre-wedding function of her son Anant Ambani with Radhika Merchant.
“…When it came to my youngest son Anant’s wedding with Radhika, I had two important wishes – first, I… pic.twitter.com/udOVozqbWP
— ANI (@ANI) March 1, 2024
ముందస్తు వివాహ వేడుకలకు ఆహ్వానాలు అందిన వారిలో బాలీవుడ్ ప్రముఖులు అమితాబ్ బచ్చన్, షారుక్ ఖాన్ సహా క్రికెట్ దిగ్గజాలు సచిన్ టెండూల్కర్, ఎంఎస్ ధోనీ ఉన్నారు. వ్యాపార దిగ్గజాల్లో మెటా సీఈఓ మార్క్ జుకర్బర్గ్, మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్, ఆల్ఫాబెట్ సీఈఓ సుందర్ పిచాయ్, అడోబ్ సీఈఓ శంతను నారాయణ్, బ్లాక్ రాక్ సీఈఓ లారీ ఫింగ్, అడ్నాక్ సీఈఓ సుల్తాన్ అహ్మద్, వాల్ట్ డిస్నీ సీఈఓ బాబా ఐగర్ వంటి వారు ఉన్నారు. అలాగే దేశీయ వ్యాపార దిగ్గజాల్లో గౌతమ్ అదానీ, టాటా సన్స్ ఛైర్మన్ ఎన్.చంద్రశేఖరన్, గోద్రేజ్ కుటుంబం, ఇన్ఫోసిస్ ఛైర్మన్ నందన్ నీలేకనీ, బిర్లా గ్రూప్ ఛైర్ పర్సన్ కుమార్ మంగళం బిర్లా, ఆర్పీఎస్జీ గ్రూప్ హెడ్ సంజీవ్ గోయెంకా, అదర్ పూనావాలా, సునీల్ మిట్టల్, పవన్ ముంజాల్, నిఖిల్ కామత్, దిలీప్ సంఘ్వీ వంటి వారు ఉన్నారు.
ఆహ్వానం అందిన వారు ఇప్పటికే జామ్నగర్ చేరుకుంటున్నారు. మెటా అధినేత మార్క్ జుకర్బర్గ్, తన సతీమణి ప్రిసిల్లా చాన్, పాప్ సింగర్ రిహన్నా, బాలీవుడ్ తారలు రణ్వీర్ – దీపిక, ఆలియా భట్-రణబీర్ కపూర్, రాణీ ముఖర్జీ, షారుక్ ఖాన్ కుటుంబం, అర్జున్ కపూర్, దర్శకుడు అట్లీ తదితరులు ఇప్పటికే జామ్నగర్ చేరుకున్నారు. సాయంత్రం 5 గంటల తర్వాత ప్రీవెడ్డింగ్ వేడుకలు ప్రారంభం కానున్నాయి.
అతిథులకు 2,500 రకాల వంటకాలు..
మరోవైపు ఈ వేడుకల్లో అతిథులకు పసందైన వంటకాలు వడ్డించనున్నారు. ఏకంగా 2,500 వంటకాలను వడ్డించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఒకసారి వడ్డించిన వంటకాన్ని మరోసారి వడ్డించకుండా విందు ఇవ్వనున్నట్లు సమాచారం. దీని కోసం ప్రత్యేక మెనూ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. 2,500 వంటకాల తయారీ కోసం మధ్యప్రదేశ్లోని ఇండోర్ నుంచి 21 మంది చెఫ్లను పిలిపించినట్లు వార్తలు షికారు చేస్తున్నాయి. అతిథులకు భారతీయ వంటకాలతో పాటు జపనీస్, మెక్సికన్, థాయ్, పార్సీ ఇలా పలు సంప్రదాయ వంటలను రుచి చూపించున్నట్లు తెలుస్తోంది. బ్రేక్ ఫాస్ట్లో 75 వెరైటీలు, లంచ్లో 225, డిన్నర్లో 275 రకాల వంటలను వడ్డించనున్నారు. అర్ధరాత్రి 12 నుంచి తెల్లవారుజామున 4 గంటల వరకు 85 వంటకాల్లో అతిథులు ఏది కోరుకుంటే అది అందించాలని ప్లాన్ చేసినట్లు సమాచారం.
అతిథుల కోసం అల్ట్రా లగ్జరీ టెంట్స్
జామ్నగర్లో ఫైవ్స్టార్ హోటళ్లు లేకపోవడంతో వాటికి ఏమాత్రం తగ్గకుండా వేడుకల కోసం వచ్చే బిలియనీర్ గెస్ట్లకు అంబానీ కుటుంబం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఫైవ్స్టార్ హోటళ్లను తలదన్నే విధంగా గెస్ట్లు స్టే చేసేందుకు అల్ట్రా లగ్జరీ టెంట్ (ultra luxury tent)లను ఏర్పాటు చేసింది. అతిథుల కోసం ఏర్పాటు చేసిన ఈ విలాసవంతమైన టెంట్లలో టైల్డ్ బాత్రూమ్స్ సహా సకల సదుపాయాలూ ఉంటాయి.
కాబోయే కోడలికి ఖరీదైన గిఫ్ట్లు..
ముకేశ్ అంబానీ దంపతులు కాబోయే కోడలు ‘రాధికా మర్చంట్’కు ఖరీదైన గిఫ్టులు అందించారు. వాటిలో కోట్ల రూపాయల ఖరీదుచేసే కారు, లక్షల విలువైన వెండి, వజ్రాభరణాలు ఉన్నాయి. అత్తింటి వారు తమ కాబోయే కోడలికి ముందుగానే సుమారు రూ.4.5 కోట్ల విలువచేసే బెంట్లీ కారు, వెండితో చేసిన లక్ష్మీ గణపతి విగ్రహం, డైమండ్ నెక్లెస్లను గిఫ్ట్గా ఇచ్చినట్లు సమాచారం.
Also Read..
Gold Seized | తిరుచ్చి ఎయిర్పోర్ట్లో వెయ్యి గ్రాముల బంగారం పట్టివేత
Mahesh Babu | ఆసక్తికరంగా మహేశ్ బాబు నయా డెసిషన్.. అభిమానుల్లో జోష్
MLA Sanjay Kumar | ఆర్ఎంపీ, పీఎంపీల సమస్యల పరిష్కారానికి కృషి