Womens T20 WC : దక్షిణాఫ్రికా ఆతిథ్యం ఇస్తోన్న మహిళల టీ 20 వరల్డ్ కప్ ఆఖరి సమరం ఈరోజు. ఐదుసార్లు ఛాంపియన్ ఆస్ట్రేలియా, తొలిసారి ఫైనల్లో అడుగుపెట్టిన దక్షిణాఫ్రికా కేప్టౌన్లోని న్యూలాండ్స్లో టైటిల్ కోసం పోటీపడనున్నాయి. దాంతో, ఫైనల్ ఫైట్కు ముందు ఇరుజట్ల కెప్టెన్లు వరల్డ్ కప్ ట్రోఫీతో ఉన్న ఫొటోను ఐసీసీ ఆన్లైన్లో షేర్ చేసింది. ఆస్ట్రేలియా కెప్టెన్ మెగ్ లానింగ్, సఫారీ జట్టు సారథి సునే లుస్ ట్రోఫీతో ఫొటోలకు పోజిచ్చారు.
వరుస విజయాలతో ఫైనల్ చేరిన ఆసీస్ను సఫారీ జట్టు నిలువరిస్తుందా? అనేది మరికొన్ని గంటల్లో తేలిపోనుంది. సాయంత్రం 6ః30 గంటలకు మ్యాచ్ ప్రారంభం అవుతుంది. ఈ మ్యాచ్ చూసేందుకు ఫ్యాన్స్ ఆసక్తి చూపించడంతో టికెట్లు పూర్తిగా అమ్ముడుపోయాయి.
మొదటి సెమీఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో భారత జట్టు 5 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 20 ఓవర్లలో 172 రన్స్ చేసింది. ఛేదనలో టీమిండియా 8 వికెట్ల నష్టానికి 167 పరుగులకే పరమితమైంది. కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ ఫిఫ్టీ బాదినా కూడా జట్టును గెలిపించలేకపోయింది. చివర్లో ఆమె రనౌట్ కావడంతో విజయం చేజారింది. రెండో సెమీఫైనల్లో దక్షిణాఫ్రికా 6 పరుగులతో ఇంగ్లండ్ను చిత్తు చేసింది. మొదట బ్యాటింగ్ చేసిన సఫారీ జట్టు 164 పరుగుల టార్గెట్ నిర్దేశించింది. అయితే.. ఇంగ్లండ్ జట్టు నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 158 రన్స్ చేసిందంతే.
ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డు కోసం ఐసీసీ అద్భుతంగా రాణించిన ఆటగాళ్ల జాబితాను ఈరోజు విడుదల చేసింది. కీలక ఇన్నింగ్స్లతో తమ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన తొమ్మిది మంది క్రికెటర్లను షార్ట్ లిస్ట్ చేసింది. భారత జట్టు నుంచి వికెట్ కీపర్ రీచా ఘోష్ మాత్రమే ఈ లిస్టులో చోటు దక్కించుకుంది.