ICC : దక్షిణాఫ్రికా ఆతిథ్యం ఇస్తున్న మహిళల టీ20 వరల్డ్ కప్ తుది అంకానికి చేరుకుంది. దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా జట్టు కేప్టౌన్లోని న్యూలాండ్స్ వేదికగా ఆదివారం (ఫిబ్రవరి 26న) టైటిల్ పోరుకు సిద్ధమయ్యాయి. దాంతో, ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డు కోసం ఐసీసీ అద్భుతంగా రాణించిన ఆటగాళ్ల జాబితాను ఈరోజు విడుదల చేసింది. కీలక ఇన్నింగ్స్లతో తమ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన తొమ్మిది మంది క్రికెటర్లను షార్ట్ లిస్ట్ చేసింది. భారత జట్టు నుంచి వికెట్ కీపర్ రీచా ఘోష్ మాత్రమే ఈ లిస్టులో చోటు దక్కించుకుంది.
ఫైనల్ చేరిన ఆసీస్ టీమ్ నుంచి ముగ్గురు, సఫారీ జట్టు నుంచి ఇద్దరు ఈ లిస్టులో ఉన్నారు. వాళ్లు ఎవరంటే..? ఆస్ట్రేలియా టీమ్ నుంచి బ్యాటింగ్, బౌలింగ్లో రాణించిన మేగ్ లానింగ్, అలిసా హేలీ, అష్ గార్డ్నర్లు ఈ లిస్టులో చోటు సంపాదించారు. ఇంగ్లండ్ (నాట్ సీవర్ బ్రంట్, సోఫీ ఎక్లెస్టోన్), దక్షిణాఫ్రికా జట్టు (లారా వొల్వార్డ్, తజ్మిన్ బ్రిస్ట్) నుంచి ఇద్దరేసి చొప్పున ఈ జాబితాలో స్థానం పొందారు. వెస్టిండీస్ నుంచి హేలీ మథ్యూస్ను ఐసీసీ షార్ట్ లిస్ట్ చేసింది. ఈ తొమ్మిది మందిలో ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్గా నిలిచేది ఎవరు? అనే ఆసక్తి అభిమానుల్లో మొదలైంది.
మహిళల టీ20 వరల్డ్ కప్లో భారత జట్టు పోరాటం సెమీస్లోనే ముగిసింది. అయితే.. ఈ టోర్నీలో వికెట్ కీపర్ రీచా ఘోష్ అదరగొట్టింది. ఫినిషర్గా రాణించింది. తొలి మ్యాచ్లో పాకిస్థాన్పై 43 రన్స్తో కీలక ఇన్నింగ్స్ ఆడింది. జెమీమా రోడ్రిగ్స్తో కలిసి 53 రన్స్ జోడించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించింది. ఇంగ్లండ్తో జరిగిన మ్యాచ్లో 47 రన్స్ చేసింది. ఐదు ఇన్నింగ్స్లలో రీచా రెండు సార్లు మాత్రమే ఔట్ అయింది. అంతేకాదు 130 స్ట్రయిక్ రేటుతో పరుగులు సాధించింది. దాంతో, కెరీర్లోనే బెస్ట్ ర్యాంకు సాధించింది. ఐసీసీ బెస్ట్ బ్యాటర్స్లో రీచా 20వ స్థానంలో నిలిచింది.
టైటిల్ ఫేవరెట్గా బరిలోకి దిగిన హర్మన్ప్రీత్ సేన సెమీఫైనల్లో వెనుదిరిగింది. ఆస్ట్రేలియా చేతిలో 5 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 20 ఓవర్లలో 172 రన్స్ చేసింది. ఛేదనలో భారత్ 8 వికెట్ల నష్టానికి 167 పరుగులకే పరమితమైంది. హర్మన్ప్రీత్ ఫిఫ్టీ బాదినా కూడా జట్టును గెలిపించలేకపోయింది. చివర్లో ఆమె రనౌట్ కావడంతో విజయం చేజారింది. రెండో సెమీఫైనల్లో దక్షిణాఫ్రికా 6 పరుగులతో ఇండ్లండ్ను చిత్తు చేసింది. సఫారీ జట్టు 164 పరుగుల టార్గెట్ నిర్దేశించింది. అయితే.. ఇంగ్లండ్ జట్టు నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 158 రన్స్ చేసిందంతే.