Chandrasekharan | ఢిల్లీ: టాటా కంపెనీ వార్షిక జనరల్ సమావేశం (General Meeting) ఆగస్టు 18న నిర్వహించనున్నారు. అంతకంటే ముందే టాటా సన్స్ చైర్మన్ పదవికి ఎన్ చంద్రశేఖరన్ రాజీనామా చేశారు. దీంతో కంపెనీ వర్గాల్లో ఈ విషయం చర్చకు దారితీసింది. టాటా గ్రూప్లో వృత్తి జీవితం 40 ఏండ్లు పూర్తయ్యింది. ప్రతిష్ఠాత్మక సంస్థలో పనిచేయడం చాలా సంతృప్తినిచ్చింది. టాటా సన్స్కు దశాబ్ద కాలంగా నాయకత్వం వహించడం నాకు దక్కిన గొప్ప గౌరవం అని చంద్రశేఖరన్ ఓ ప్రకటనలో తెలిపారు.
నోయల్ టాటాతో విభేదాలు
చంద్రశేఖరన్ చైర్మన్ పదవి 2027, ఫిబ్రవరిలో ముగుస్తుంది. తర్వాత పునర్నియామకం జరుగుతుంది. కానీ టాటా ట్రస్ట్ చైర్మన్ నోయల్ (Noel) టాటా, షేర్హోల్డర్స్తో ఉన్న విభేదాల కారణంగా పదవికి రాజీనామా చేశారు. టాటా సన్స్ 30కి పైగా కంపెనీలను నిర్వర్తిస్తుంది. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS)తో పాటు టాటా మోటార్స్ అండ్ ఎయిర్ ఇండియా, టాటా ట్రస్ట్స్, ది గ్రూప్స్ చారిటబుల్ ఆర్మ్ తదితర కంపెనీల బాధ్యతలను చూసుకుంటుంది.
టాటా సన్స్, టాటా ట్రస్ట్ల మధ్య విభేదాల కారణంగా 2016లో సైరస్ మిస్త్రీని (Cyrus Mistry) చైర్మన్ పదవి నుంచి తొలగించారు. 2017లో టాటా సన్స్ చైర్మన్గా చంద్రశేఖరన్ నియమితులయ్యారు. ఆయన టాటాలో 1987లో జాయిన్ అయ్యారు. 2009లో సీఈవోగా పనిచేశారు. ఆయన చైర్మన్గా బాధ్యతలు చేపట్టిన తరువాత టెక్నాలజీ, ఏవియేషన్ రంగాల వైపు కంపెనీని సక్సెస్గా నడిపించారు.
పడిపోయిన షేర్లు
చంద్రశేఖరన్ రాజీనామా తరువాత టాటా కంపెనీ షేర్లు (Shares) పడిపోయాయి. టాటా పవర్ 1.26 శాతం, టీసీఎస్ 3.9 శాతం, టాటా స్టీల్ 1.83 శాతం తగ్గినట్లు ఉదయం 11:30 గంటలకు షేర్ మార్కెట్లో గణాంకాలు నమోదయ్యాయి.