Saba Karim : భారత టెస్టు జట్టు వైస్ కెప్టెన్ పోస్ట్ ఖాళీగా ఉండడంపై మాజీ సెలెక్టర్ సబా కరీం ఆసక్తికర కామెంట్ చేశాడు. టీమ్ మేనేజ్మెంట్ వికెట్ కీపర్ రిషభ్ పంత్ కోసం ఎదరుచూస్తోందని కరీం అన్నాడు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న బోర్డర్ – గవాస్కర్ తొలి రెండు టెస్టుల్లో విఫలమైన టీమిండియా వైస్ కెప్టెన్గా కేఎల్ రాహుల్ను తప్పించారు. అయితే.. అతడి స్థానంలో మరొకరికి ఆ బాధ్యతలు అప్పగించలేదు.
అందుకు కారణం.. కోచ్, కెప్టెన్ అంతా పంత్ రాక కోసం చూస్తున్నారని, అందుకనే టెస్టు జట్టు వైస్ కెప్టెన్గా ఎవరిని నియమించలేదని కరీం వెల్లడించాడు. ‘వైస్ కెప్టెన్ పదవికి రిషభ్ పంత్ అన్నివిధాలా సరైనోడు. అతను మరింత మెరుగవుతాడు’ అని అన్నాడు.
పోయిన ఏడాది డిసెంబర్ 30న పంత్ కారు యాక్సిడెంట్లో గాయపడిన విషయం తెలిసిందే. ఈమధ్యే అతడికి ముంబైలోని కోకిలా బెన్ హాస్పత్రిలో సర్జరీ అయింది. కర్రల సాయంతో నడుస్తున్న ఫొటోలను ఆన్లైన్లో పోస్ట్ చేశాడు. పంత్ కోలుకునేందుకు మరింత సమయం పట్టనుంది. దాంతో, బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీ, ఐపీఎల్ 2023కు పంత్ దూరం అయ్యాడు. అతని ప్లేస్లో ఆస్ట్రేలియా సిరీస్కు కేఎస్ భరత్, ఇషాన్ కిషన్ను బీసీసీఐ ఎంపిక చేసింది.
అయితే.. ఈఏడాది ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్, వన్డే వరల్డ్ కప్ వంటి మెగా టోర్నీలు ఉన్నాయి. ఆలోపు పంత్ పూర్తిగా కోలుకుంటాడా? ఫిట్నెస్ సాధిస్తాడా? అనేది తెలియాలి. ఎటాకింగ్ గేమ్ ఆడే పంత్ లాంటి హిట్టర్ లేకపోవడం భారత జట్టుకు పెద్ద లోటే అని చెప్పాలి. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ సిరీస్లో పంత్ ఎంతలా చెలరేగి ఆడాడో అందరికి తెలిసిందే. భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య మూడో టెస్టు మార్చి 1న ఇండోర్లో ప్రారంభం కానుంది.