Mrunal Takhur | బాలీవుడ్తో పాటు దక్షిణాది సినీ పరిశ్రమలోనూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న స్టార్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ మరోసారి వార్తల్లో నిలిచారు. డీప్ఫేక్ (Deepfake) ఫొటోల కారణంగా హాట్ టాపిక్గా మారింది. తనకు సంబంధించిన మార్ఫింగ్ చేసిన చిత్రాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడంపై మృణాల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై కఠిన చర్యలు తీసుకుంటానని హెచ్చరిస్తూ సోషల్ మీడియా వేదికగా ప్రకటన విడుదల చేశారు. ఓ ఎంటర్టైన్మెంట్ పేజ్ మృణాల్ ఠాకూర్ మార్ఫింగ్ చేసిన ఫొటోలను అభ్యంతరకర రీతిలో షేర్ చేసింది.ఏఐ సాయంతో రూపొందించిన ఈ డీప్ఫేక్ చిత్రాలు సోషల్ మీడియాలో వేగంగా వైరల్ కావడంతో మృణాల్ స్పందించక తప్పలేదు.
ఈ ఫొటోలు పూర్తిగా నకిలీవని, తన అనుమతి లేకుండా రూపొందించి ప్రచారం చేస్తున్నారని ఆమె స్పష్టం చేశారు. ఈ వ్యవహారంపై స్పందించిన మృణాల్ ఠాకూర్.. నా పేరుతో ప్రచారం చేస్తున్న ఈ మార్ఫింగ్ ఫొటోలు పూర్తిగా అనధికారికమైనవి, చట్టవిరుద్ధమైనవి. వెంటనే వాటిని తొలగించాలి. ఇకపై ఎవరైనా ఈ చిత్రాలను షేర్ చేసినా లేదా ప్రచారం చేసినా వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు అధికారికంగా ఫిర్యాదు చేస్తాను అంటూ హెచ్చరించారు. సెలబ్రిటీల వ్యక్తిగత గౌరవాన్ని దెబ్బతీసేలా ఇలాంటి డీప్ఫేక్ కంటెంట్ను సృష్టించడం, ప్రచారం చేయడం తీవ్ర నేరమని ఆమె పేర్కొన్నారు.
ఇటీవలి కాలంలో ఏఐ సాంకేతికతను దుర్వినియోగం చేస్తూ పలువురు సినీ నటీమణుల ఫొటోలు, వీడియోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్న ఘటనలు పెరుగుతున్నాయి. ఇంతకుముందు స్టార్ హీరోయిన్ రష్మిక మందన్నతో పాటు పలువురు ప్రముఖ నటీమణులు కూడా ఇలాంటి డీప్ఫేక్ వీడియోల బారిన పడ్డారు. అప్పట్లో ఈ ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారగా, డీప్ఫేక్లపై కఠిన చట్టాలు అవసరమన్న డిమాండ్ కూడా వినిపించింది. ఇప్పుడు మృణాల్ ఠాకూర్ కూడా బహిరంగంగా స్పందించడంతో సోషల్ మీడియాలో జరుగుతున్న డిజిటల్ దుర్వినియోగంపై మరోసారి చర్చ మొదలైంది. మృణాల్ తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికీ, ఆమెకు సంబంధించినట్లు ప్రచారం చేస్తున్న కొన్ని వివాదాస్పద పోస్టులు ఇప్పటికీ సోషల్ మీడియాలో కనిపిస్తుండటం గమనార్హం. ఈ ఘటనపై సంబంధిత సోషల్ మీడియా ప్లాట్ఫాంస్ లేదా అధికార యంత్రాంగం ఎలాంటి చర్యలు తీసుకుంటాయన్నది ఆసక్తికరంగా మారింది.