షార్జా: అది భారత్, పాక్ మ్యాచ్ కాదు. అయినా తీవ్ర ఉత్కంఠ. చివరి దాకా నువ్వా నేనా అన్నట్లుగా సాగిన ఆ మ్యాచ్లో ప్రత్యర్థి జట్టు గెలుపొందింది. దీంతో సొంత టీం ఓటమిని తట్టుకోలేకపోయిన ఫ్యాన్స్.. స్టేడియంలో గలాటా చేశారు. ఆపోజిట్ టీం అభిమానులను చితకబాదారు. కుర్చీలు పీకిపడేశారు. స్టేడియంలో రచ్చరచ్చ చేశారు. ఇదంతా ఆసియాకప్లో భాగంగా పాక్, అఫ్గానిస్థాన్ మధ్య బుధవారం జరిగిన మ్యాచ్ అనంతరం చోటుచేసుకుంది.
After the Afg Pak World Cup match last year I decided I would never watch another game between these two teams at the stadium. pic.twitter.com/JrJnpmUP09
— Twitt.Arhum (@arhuml92) September 7, 2022
పసికూన అఫ్గానిస్థాన్ జట్టు పాక్ను ఓడించినంత పనిచేసింది. చివరి వరకు నువ్వానేనా అన్నట్లు సాగిన మ్యాచ్లో పాక్ విజయం సాధించి ఫైనల్కు దూసుకెళ్లింది. దీంతో ఆ జట్టు అభిమానులు సంబురాలు చేసుకుంటున్నారు. అయితే తమ జట్టు గెలుపుదాకా వచ్చి ఓటమి చవిచూడటంతో జీర్ణించుకోలేకపోయిన అఫ్గాన్ అభిమానులు షార్జా స్టేడియంలో రచ్చరచ్చ చేశారు. పాక్ అభిమానులపై దాడులు చేశారు.
ప్రతిగా వారు కూడా దాడికి దిగడంతో పెద్ద గలాటాయే చోటుచేసుకుంది. ఒకరిపై ఒకరు కుర్చీలు విసుకున్నారు. పిడిగుద్దులు గుద్దుకున్నారు. స్టేడియంలో కుర్చీలను చిందరవందరగా పడేశారు. పాక్ జెర్సీ వేసుకున్న ఓ వ్యక్తిని మరో వ్యక్తి కుర్చీతో కొడుతున్న దృష్యాలు వీడియోలో రికార్డయ్యాయి. అఫ్గానిస్థాన్ జిందాబాద్ నినాదాలతో స్టేడియం మారుమ్రోగిపోయింది.
Afghanistan Fans Showing Their Anger After Today's Loss #PakvsAfg pic.twitter.com/sGcbn3xJh9
— r/Ghar Ke Kalesh (@gharkekalesh) September 7, 2022
బుధవారం హోరాహోరీగా సాగిన పోరులో పాక్ ఒక వికెట్ తేడాతో అఫ్గాన్పై గెలుపొందింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన అఫ్గాన్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 129 పరుగులు చేసింది. ఇబ్రహీం (35) టాప్ స్కోరర్ కాగా.. పాక్ బౌలర్లలో రవుఫ్ రెండు వికెట్లు పడగొట్టాడు.
అనంతరం ఛేదనలో పాకిస్థాన్ 19.2 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 131 పరుగులు చేసింది. షాదాబ్ ఖాన్ (36), ఇఫ్తిఖార్ (30) రాణించారు. చివరి ఓవర్లో విజయానికి 11 పరుగులు అవసరమైన దశలో పాక్ పేసర్ నసీమ్ షా (14 నాటౌట్) వరుస బంతుల్లో రెండు భారీ సిక్సర్లు కొట్టి జట్టును ఫైనల్కు చేర్చాడు.