పల్లెప్రగతితో మారిన గ్రామ రూపు రేఖలు
అందుబాటులోకి డంపింగ్యార్డు, పల్లెప్రకృతి వనం
వీధివీధినా సీసీరోడ్ల నిర్మాణాలు, డ్రైనేజీల నిర్మాణం
ఇంటింటా చెత్త సేకరణతో పరిసరాలు పరిశుభ్రం
రోడ్లకు ఇరువైపులా ఏపుగా హరితహారం మొక్కలు
రూ.35లక్షలతో అభివృద్ధి వైపు పరుగులు
హర్షం వ్యక్తం చేస్తున్న గ్రామస్తులు
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లెప్రగతితో రాయపోల్ మండలంలోని రాంసాగర్ గ్రామం అభివృద్ధిలో ఆదర్శంగా నిలుస్తున్నది. ఉమ్మడి రాష్ట్రంలో కనీస సౌకర్యాలు కూడా లేని ఈ గ్రామం ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరువాత టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రగతివైపు పరుగులు పెడుతున్నది. వైకుంఠధామం, డంపింగ్ యార్డు, పల్లెప్రకృతి వనం తదితర అభివృద్ధి కార్యక్రమాలు చేపటడ్డంతో గ్రామ రూపురేఖలే మారిపోయాయి. పరిసరాల పరిశుభ్రత కోసం ప్రతిరోజు ఇంటింటికీ తిరుగుతూ పంచాయతీ ట్రాక్టర్ ద్వారా పారిశుధ్య సిబ్బంది చెత్తసేకరణ చేసి డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు. సీసీరోడ్లకు ఇరువైపులా నాటిన హరితహారం మొక్కలు ఏపుగా పెరిగి ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. ప్రతి వీధినా సీసీరోడ్లతో ఇప్పుడు గ్రామం అందంగా ముస్తాబైంది. సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
అందరి సహకారంతోనే అభివృద్ధి..
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లెప్రగతి కార్యక్రమంలో భాగంగా గ్రామం అభివృద్ధిలో దూసుకుపోతున్నది. ఏండ్ల నాటి సమస్యలతో ఎంతో ఇబ్బందులు పడుతున్న గ్రామస్తులకు ‘పల్లెప్రగతి’ తో సమస్యలన్నీ తీరిపోయాయి. గ్రామస్తుల సమష్టి కృషితో పాటు అందరి సహకారంతో గ్రామం అభివృద్ధి చెందుతున్నది. గ్రామంలోని పాత బావులు, శిథిలావస్థలో ఉన్న పాత ఇండ్లను పూడ్చివేశాం. రాజకీయాలకు అతీతంగా సమష్టి నిర్ణయాలతో మండలంలోనే ఆదర్శవంతంగా గ్రామాన్ని అభివృద్ధి చేసుకుంటున్నాం.
చేపట్టిన అభివృద్ధి పనులు..
గ్రామంలో పలు అభివృద్ధి పనులు చేపట్టారు. రూ.2లక్షలతో డంపింగ్ యార్డు, రూ.2లక్షలతో పల్లెప్రకృతి వనం, రూ.12లక్షలతో వైకుంఠధామం, రూ.80వేలతో ఇంటింటా మొక్కలు, రూ.70వేలతో తడి, పొడి చెత్త బుట్టల పంపిణీ చేశారు. హరితహారంలో 1500 మొక్కలను నాటారు. హరితహారం మొక్కలను పెంచేందుకు నర్సరీని ఏర్పాటు చేశారు. గ్రామంలోని ప్రతి ఇంటికీ మరుగుదొడ్డితో పాటు ఇంకుడు గుంతలను సైతం నిర్మించారు. రూ.20 లక్షలతో సీసీరోడ్ల నిర్మాణం చేపట్టారు. గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో రూ.4లక్షతో మైక్సౌండ్ను ఏర్పాటు చేశారు. 25 డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణాలను పూర్తి చేశారు. తాగునీటి సమస్య పరిష్కారానికి ఇంటింటా మిషన్ భగీరథ నల్లాను బిగించారు.
శుద్ధమైన వాటర్ ప్లాంట్ ఏర్పాటు..
గ్రామస్తులు, దాతల సహకారంతో 5వేల లీటర్ల కెపాసిటీ గల వాటర్ ప్లాంట్ను ఏర్పాటు చేయించారు. వాటర్ ప్లాంట్ ఏర్పాటు కావడంతో గ్రామస్తులందరికీ శుద్ధమైన తాగునీరు అందుతున్నది. గ్రామ పంచాయతీ పాలకవర్గం ఎప్పటికప్పడూ గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యుల సలహాలు, సూచనలు పాటించడంతో మండలంలోనే రాంసాగర్ అభివృద్ధిలో చకచకా పరుగులు తీస్తున్నది.
నిత్యం చెత్త సేకరణ..
గ్రామంలో 10 వార్డులు ఉండగా.. ప్రభుత్వం అందించిన ట్రాక్టర్తో నిత్యం పారిశుధ్య సిబ్బంది గ్రామంలో ప్రతి ఇంటికీ తిరుగుతూ తడి, పొడి చెత్తను సేకరించి డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు. దీంతో గ్రామం పరిశుభ్రంగా మారింది. గ్రామంలో నాటిన హరితహారం మొక్కలకు పంచాయతీ ట్రాక్టర్ ద్వారా ప్రతి రోజూ నీరు పడుతున్నారు.
ఇవీ కూడా చదవండి..
ఫ్రిజ్లో వీటిని అసలు పెట్టకూడదు