సిద్దిపేట కలెక్టరేట్, జూన్ 23 : దేశానికి తెలంగాణ పల్లెలు, పట్టణాలు ఆదర్శంగా నిలువాలన్న ఉద్దేశంతో సీఎం కేసీఆర్ పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారని సిద్దిపేట వెంకట్రామ్రెడ్డి అన్నారు. బుధవారం సిద్దిపేట నూతన సమీకృత కలెక్టరేట్లో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం ఆశించిన ఫలితాలు రావాలంటే అధికారుల పనివేళ్లలో మార్పులు తెచ్చుకుంటేనే సాధ్యమవుతుందన్నారు. పల్లెలు, పట్టణాలకు సరికొత్త దశ, దిశను నిర్దేశించేందుకు సీఎం కేసీఆర్ పంచాయతీరాజ్ చట్టానికి సవరణలు చేశారని గుర్తుచేశారు. ప్రతి పంచాయతీకి కార్యదర్శిని నియమించారని తెలిపారు. ప్రభుత్వం ప్రతినెలా పంచాయతీలకు నిధులు క్రమం తప్పకుండా విడుదల చేస్తున్నదన్నారు.
దేశంలో ఎక్కడాలేని విధంగా ప్రతి గ్రామానికి వైకుంఠధామం, డంపింగ్యార్డు, నర్సరీ, ట్రాక్టర్, ట్రాలీ, ట్యాంకర్ వంటి సౌకర్యాలను కల్పించిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందన్నారు. అధికారులు స్థానికంగానే ఉండి విధులు నిర్వర్తించాలన్నారు. అధికారులు ఊరూరా తిరిగి జరుతున్న పనులను పర్యవేక్షించాలన్నారు. గ్రామాల్లో ప్రజల కనీస అవసరాలను తీర్చే బాధ్యత అధికారులపై ఉందన్నారు. వచ్చే నాలుగు నెలల్లో గుణాత్మక మార్పులు రావాలన్నారు. హైదరాబాద్ నుంచి రాకపోకలు సాగించే అధికారులకు షోకాజ్ నోటీసులు అందజేస్తామన్నారు. అప్పటికీ మార్పు రాకుంటే సర్వీస్ నుంచి తొలిగిస్తామని హెచ్చరించారు. అధికారులు టూర్డైరీని వారం రోజులకొసారి తమకు సమర్పించాలన్నారు. కార్యక్రమాల్లో ఆలస్వతం వహిస్తే అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
హరితహారంలో అందరూ భాగస్వామ్యం కావాలి
హరితహారంలో అందరూ భాగస్వామ్యం కావాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. ఏడో విడుత హరితహారం ప్రచార పోస్టర్ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాకు ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాన్ని వందశాతం పూర్తిచేసేలా పకడ్బందీ కార్యాచరణ సిద్ధం చేయాలన్నారు. సిద్దిపేట జిల్లాను హరిత సిద్దిపేటగా తీర్చిదిద్దాలన్నారు. సమీక్షా సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ ముజామ్మిల్ఖాన్, జిల్లా గ్రామీణాభివృద్ధిశాఖ అధికారి గోపాలరావు, జిల్లా పంచాయతీ అధికారి పార్ధసారథి తదితరులు పాల్గొన్నారు.