హుస్నాబాద్, మే 23: హుస్నాబాద్ సర్కారు దవాఖానలో కరోనా ఐసొలేషన్ సెంటర్ కోసం అధికారులు ఏర్పాట్లు ముమ్మ రం చేశారు. పాత దవాఖాన భవనంలోని రెండు హాళ్లను కరోనా వార్డులుగా మార్చి అందులో తగిన సౌకర్యాలు కల్పిస్తున్నారు. ఇప్పటికే 15 వరకు బెడ్లను వార్డుల్లో సిద్ధం చేశారు. వార్డుతో పాటు దవాఖాన చుట్టుపక్కల సైతం శుభ్రం చేయించారు. శానిటేషన్ కూడా చేయించారు. ఇంకా కావాల్సిన సౌకర్యాలను సమకూర్చడంలో అధికారులు నిమగ్నమయ్యారు. ఇటీవల దవాఖానను సందర్శించిన డీఎంహెచ్వో డాక్టర్ మనోహర్ హుస్నాబాద్ దవాఖానలో కరోనా బాధితుల కోసం ఐసొలేషన్ సెంటర్ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. ఐసొలేషన్ వార్డును అన్ని విధాలుగా సిద్ధం చేశాక సేవలు ప్రారంభిస్తామని చెప్పారు. దీంతో స్థానిక వైద్యాధికారులు సెంటర్ కు, రోగులకు కావాల్సిన సౌకర్యాలపై దృష్టిసారించారు. అందుకు తగిన సిబ్బందిని కూడా అందుబాటులో ఉంచుకునేందుకు సన్నద్ధ్దం అవుతున్నారు.