నంగునూరు, ఏప్రిల్ 19 : కరోనా నివారణ వ్యాక్సిన్ కోసం వచ్చే వారికి ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చూడాలని, సెంటర్ల వద్ద సరిపడా సిబ్బందిని అందుబాటులో ఉంచి సజావుగా వ్యాక్సినేషన్ పూర్తిచేయాలని సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామ్రెడ్డిని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు ఆదేశించారు. సోమవారం రాజగోపాల్పేట పీహెచ్సీని మంత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. టీకా కోసం వచ్చిన జనంతో మంత్రి మాట్లాడి ఏమైనా సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. ఎప్పుడో పొద్దుగాళ్ల వచ్చినం, ఇంకా సూది ఇయ్యలే అని మంత్రికి వారు తెలిపారు. ఎందుకు జాప్యం జరుగుతుందని మంత్రి ఆరాతీయగా, పేర్ల నమోదుకు సమయం పడుతున్నదని, తక్కువ మంది సిబ్బంది ఉండడంతో ఇబ్బంది అవుతున్నదని, మరింత మంది సిబ్బందిని నియమించి ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయాలని కోరారు. సెంటర్ల వద్ద తాగునీరు, మౌలిక వసతులు కల్పించాలని వైద్యాధికారి రాధికను మంత్రి ఆదేశించారు.
వ్యాక్సినేషన్ ఎలా జరుగుతుందని ఆరాతీయగా, మహిళలకు టీకా వేయడంలో జాప్యం జరుగుతుందని మంత్రి దృష్టికి తెచ్చారు. వెంటనే మంత్రి హరీశ్రావు కలెక్టర్తో ఫోన్లో మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా ఎంపీడీవో, ఎంపీఈవోలు, పంచాయతీ కార్యదర్శులు, ఆశ కార్యకర్తలకు టీకా సెంటర్ల వద్ద డ్యూటీలు వేయాలని ఆదేశించారు. సెంటర్ల వద్ద పోలీసులు విధులు నిర్వర్తించి వైద్య సిబ్బందితో సమన్వయం చేసుకుంటూ ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా చూడాలని సూచించారు. ప్రజల ఇబ్బందులు తెలుసుకునేందుకు ఆకస్మిక తనిఖీ చేశానని, సమస్యలు తెలుసుకొని పరిష్కరించాలని అధికారులను ఆదేశించామన్నారు.
కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, బయటకు వచ్చినప్పుడు మాస్క్ తప్పకుండా ధరించాలని మంత్రి హరీశ్రావు సూచించారు. అనంతరం సిద్దన్నపేటలో జరిగిన బీరప్ప ఉత్సవాల్లో మంత్రి హరీశ్రావు పాల్గొని పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ కమిటీ, స్థానిక ప్రజాప్రతినిధులు మంత్రిని సన్మానించారు. మంత్రి వెంట మాజీ ఎంపీపీ జాప శ్రీకాంత్రెడ్డి, మాజీ ఏఎంసీ చైర్మన్ ఎడ్ల సోంరెడ్డి, పీఏసీఎస్ చైర్మన్లు కోల రమేశ్గౌడ్, మహిపాల్రెడ్డి, సర్పంచు రాజేంద్ర, ఎంపీటీసీ జాజాల సుమలత చందు, మాజీ జడ్పీ వైస్ చైర్మన్ రాగుల సారయ్య, సర్పంచ్ డాకూరి కనకవ్వ, ఎంపీటీసీ బెదురు తిరుపతి ఉన్నారు.
ఇవీ కూడా చదవండి…
కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించాలి
బిజినెస్ డిస్ట్రిక్ట్గా శంషాబాద్
ఆక్సిజన్ సిలిండర్లు బ్లాక్ చేస్తున్నారు