కంఠేశ్వర్, ఆగస్టు 8: ఉమ్మడి జిల్లా రైతాంగం ప్రయోజనాలను కాపాడటమే పరమావధిగా అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసి సమష్టిగా కృషి చేద్దామని ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు సూచించారు. నిజామాబాద్లోని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో ఇన్చార్జి కలెక్టర్ భవేశ్ మిశ్రా అధ్యక్షతన శనివారం నిర్వహించిన జిల్లా నీటిపారుదల సలహా మండలి సమావేశానికి ఎమ్మెల్యేలు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి, భూపతిరెడ్డి, ధన్పాల్ సూర్యనారాయణ, పైడి రాకేశ్రెడ్డి హాజరు కాగా, కామారెడ్డి కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ వర్చువల్గా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నిజాంసాగర్, శ్రీరాంసాగర్, సింగూరు, కౌలాస్నాలా, పోచారం, రామడ్గు జలాశయాల్లో నీటి నిల్వల స్థితిగతులు, ఆయకట్టు పంటలకు సాగునీటినందించే వెసులుబాటు, ప్రత్యామ్నాయ పంటల ప్రణాళిక, పంటల వైవిద్యీకరణకు రైతులకు అవగాహన కల్పించడం తదితర అంశాలపై చర్చించారు. వివిధ జలాశయాల నుంచి యాసంగి పంటలకు సాగునీటినందించేందుకు వీలుగా ప్రతీ సంవత్సరం రబీ సీజన్ సమయంలో జిల్లా నీటి పారుదల సలహా మండలి సమావేశాలు జరిగేవని, అయితే ఈసారి ఎల్నినో ప్రభావంతో రైతులు నష్టపోకుండా తగిన చర్యలు తీసుకునేందుకు వీలుగా ప్రస్తుత సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎల్నినో ప్రభావంతో మున్ముందు వర్షాలు తక్కువగా కురిసే అవకాశాలున్నందున వరి వేసిన రైతులు నష్టపోకుండా అధికారులు చొరవ చూపాలన్నారు.
ఇటీవల తుఫాన్ ప్రభావంతో వర్షాలు కురిసినప్పటికీ ఎల్నినో కారణంగా ఆగస్టు, సెప్టెంబర్లలో వర్షపాతం తక్కువగా నమోదయే అవకాశాలునన్నాయని, అందుబాటులోని నీటి వనరులను జాగ్రత్తగా వినియోగించుకోవాల్సిన అవసరముందని నిజామాబాద్ ఇన్చార్జి కలెక్టర్ భవేశ్మిశ్రా తెలిపారు. అందుబాటులో ఉన్న నీటి వనరులను వృథా కాకుండా పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకునేలా చర్యలు తీసుకోవాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూచించారు. మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, అదనపు కలెక్టర్ భుజంగరావు, ట్రెయినీ కలెక్టర్ సురేశ్, డీఆర్వో గీత, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.