గజ్వేల్, జూన్ 11 : సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గం అభివృద్ధిలో దూసుకుపోతున్నది. కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. పట్టణంలో ప్రొహిబిషన్, ఎక్సైజ్ కార్యాలయాల భవనాలు, షాదీఖానా సిద్ధం కాగా, వాటిని రేపు మంత్రి హరీశ్రావు ప్రారంభించనున్నట్లు కలెక్టర్ వెంకట్రామ్రెడ్డి వెల్లడించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు అదనపు కలెక్టర్ ముజామ్మిల్ఖాన్, మెప్మా పీడీ రమణాచారి గజ్వేల్లో ప్రారంభానికి సిద్ధంగా ఉన్న భవనాల వద్ద ఏర్పాట్లను శుక్రవారం పరిశీలించారు. కలెక్టర్ వెంకట్రామ్రెడ్డి ము లుగు క్యాంపు కార్యాలయం నుంచి ఉన్నతాధికారులతో టెలీకాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. మంత్రి హరీశ్రావు తొలు త కొడకండ్లలో రూ.3.72 కోట్లతో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్లను ప్రారంభిస్తారన్నారు.
అనంతరం గజ్వేల్-ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని గజ్వేల్ నుంచి క్యాసారం వరకు రూ.10.75 కోట్లతో నిర్మించనున్న ఆర్అండ్బీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేస్తారని తెలిపారు. అనంతరం గజ్వేల్లో 1250 డబుల్ బెడ్రూం ఇండ్లకు సంబంధించి ఎంపిక ప్రక్రియ కోసం చేపట్టనున్న దరఖాస్తుల ప్రక్రియను ప్రారంభిస్తారని వెల్లడించారు. రూ.45 లక్షలతో నిర్మించిన ప్రొహిబిషన్, ఎక్సైజ్ కార్యాలయాలను ప్రారంభిస్తారన్నారు. రూ.3 కోట్లతో ఆర్యవైశ్య భవన నిర్మాణానికి శంకుస్థాపన, రూ.3.14 కోట్లతో నిర్మించిన షాదీఖానాను ప్రారంభిస్తారని కలెక్టర్ తెలిపారు. అనంతరం రూ. 4.25 కోట్లతో నిర్మించనున్న ఆర్అండ్బీ అతిథిగృహం నిర్మాణానికి శంకుస్థాపన చేసి, రూ.7.80 కోట్లతో నిర్మించిన గజ్వేల్-ప్రజ్ఞాపూర్ మున్సిపల్ సంఘం భవనాన్ని ప్రారంభిస్తారని తెలిపారు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేయాలని, ప్రొటోకాల్ ప్రకారం ప్రజాప్రతినిధులను ఆహ్వానించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.