చిన్నకోడూరు : తెలంగాణ రాష్ట్రం వచ్చాక చేపలు దిగుమతి చేసుకునే రోజులు పోయి ఎగుమతి చేసే రోజులు వచ్చాయని సిద్దిపేట జడ్పీ చైర్పర్సన్ వేలేటి రోజారాధాకృష్ణశర్మ అన్నారు. ఆదివారం ఆమె మండలంలోని చంద్లాపూర్లోని చెరువులో మత్స్యకారులతో కలిసి చేపపిల్లలు వదిలారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం మత్స్యకారుల అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తున్నదన్నారు. సీఎం కేసీఆర్, ఆర్థిక మంత్రి హరీశ్రావు ప్రత్యేక చొరవతో సిద్దిపేట జిల్లాలో చేపపిల్లల పంపిణీ కార్యక్రమం జరుగుతున్నదన్నారు. ప్రభుత్వం మత్స్యకారులకు సబ్సిడీపై చేపపిల్లలతోపాటు వలలు, వాహనాలు, ఇతర సామగ్రిని కూడా అందజేస్తుందని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని అభివృద్ధి చెందాలన్నారు. చెరువుల్లో చేపలు పెరిగి మత్స్యకారుల సంపద పెరిగేలా మైసమ్మ తల్లి దీవించాలని కోరుకుంటున్నట్లు ఆమె తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ చంద్రకళారవిగౌడ్, ఎంపీటీసీ దుర్గారెడ్డి, ఏఎంసీ డైరెక్టర్ చంద్రమౌళిగౌడ్, టీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు లింగం, పంచాయతీ కార్యదర్శి మల్లేశం, మత్స్యకారుల సంఘం సభ్యులు పాల్గొన్నారు.