సిద్దిపేట : జాతీయ సాఫ్ట్బాల్ పోటీల్లో తెలంగాణ బాలికల జట్టు బంగారు పతకాన్ని సాధించిందని సిద్దిపేట జిల్లా సాఫ్ట్బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు కైలాసం, ప్రధాన కార్యదర్శి రేణుక తెలిపారు. గురువారం కైలాసం మాట్లాడుతూ ఒడిశా రాష్ట్రంలో ఈ నెల 19 నుంచి 23వతేదీ వరకు జరిగిన 33వ జాతీయ సబ్ జూనియర్ సాఫ్ట్బాల్ పోటీల్లో సిద్దిపేట జిల్లా టీఎస్డబ్ల్యూఆర్ఎస్ ములుగు పాఠశాలకు చెందిన కీర్తి, పూజ, లావణ్య, పూజ, అఖిల పాల్గొని ప్రతిభ చాటారన్నారు.
ఈ జట్టుకు కీర్తి సారథ్యం వహించగా క్రీడాకారులు బాగా రాణించి బంగారు పతకం సాధించారన్నారు. క్రీడాకారుల నైపుణ్యాభివృద్ధికి కృషి చేసిన ప్రిన్సిపాల్ కల్పన, రేణుకకు కృతజ్ఞతలు తెలిపారు. సిద్దిపేట అసోసియేషన్కు సహకరిస్తున్న రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శోభన్బాబుకు వారు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా వారిని సిద్దిపేట స్పోర్ట్ క్లబ్ కన్వీనర్ పాల సాయిరాం, జిల్లా యువజన క్రీడల అధికారి నాగేందర్, రాష్ట్ర సాఫ్ట్బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి శోభన్బాబు, సతీశ్, శ్యాంసుందర్ తదితరులు అభినందించారు.