మద్దూరు/ధూళిమిట్ట : కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్రం నుంచి పన్నుల రూపంలో తీసుకోవడమే తప్ప రాష్ట్రానికి తిరిగి నిధులు ఇవ్వాలన్నా విషయం తెలియదని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి విమర్శించారు. ఆదివారం ఆయన మద్దూరు, ధూళిమిట్ట మండల కేంద్రాల్లో రూ. 25లక్షల వ్యయం చొప్పున నూతనంగా నిర్మించనున్న మోడ్రన్ వెజిటేబుల్ మార్కెట్లకు ఎంపీపీ కృష్ణారెడ్డితో కలిసి శంకుస్థాపన చేసి మాట్లాడారు. కేంద్రం నుంచి నిధులు తీసుకురావడంలో ఎంపీలుగా ఉన్న బండి సంజయ్, కిషన్రెడ్డి, రేవంత్రెడ్డి పూర్తిగా విఫలమయ్యారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అండగా ఉండి ఉచితంగా విద్యుత్, పెట్టుబడి సాయాన్ని అందించడంతోపాటు పండించిన పంటను కొనుగోలు చేస్తున్నదన్నారు. యాసంగిలో పండిన మొత్తం పంటను రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేసిందన్నారు.
వానకాలం పంటను కొనుగోలు చేయాలని కేంద్రానికి స్వయంగా సీఎం కేసీఆర్, రాష్ట్ర మంత్రులు విజ్ఞప్తి చేసినా స్పందించడం లేదన్నారు. సీఎం కేసీఆర్ ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ, అభివృద్ధి పథకాలను అమలు చేస్తున్నదని కొనియాడారు. సీఎం కేసీఆర్పై కాంగ్రెస్, బీజేపీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలపై ఆయన మండిపడ్డారు. ఈటల రాజేందర్ తన సొంత ఆస్తులను పెంచుకున్నాడు తప్ప హుజూరాబాద్ ప్రజలకు చేసింది ఏమి లేదన్నారు. హుజూరాబాద్లో టీఆర్ఎస్ జెండా ఎగరడం ఖాయమన్నారు. అనంతరం నూతనంగా ఎన్నికైన టీఆర్ఎస్ యూత్ కమిటీని ఎమ్మెల్యే అభినందించారు.
కార్యక్రమంలో జడ్పీటీసీ గిరి కొండల్రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ నాగిళ్ల తిరుపతిరెడ్డి టీఆర్ఎస్ ధూళిమిట్ట మండల అధ్యక్షుడు మంద యాదగిరి, ఏపీవో పరశురాములు, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షురాలు చొప్పరి వరలక్ష్మీసాగర్, ధూళిమిట్ట, మద్దూరు సర్పంచ్లు దుబ్బుడు దీపికావేణుగోపాల్రెడ్డి, కంఠారెడ్డి జనార్దన్రెడ్డి, ఎంపీటీసీ బొప్పె కనకమ్మ, ఏఎంసీ వైస్ చైర్మన్ పుర్మ వెంకట్రెడ్డి, డైరెక్టర్ బావండ్లపల్లి కృష్ణ, మాజీ జడ్పీటీసీ పద్మావెంకట్గౌడ్, టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు బర్మ రాజమల్లయ్య, యూత్ మండల అధ్యక్షుడు బడుగు సాయిలు, వివిధ గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, అధికారులు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.