ఎల్లారెడ్డి రూరల్/ నిజాంసాగర్/ పిట్లం, మే 3: అకాల వర్షాలకు అక్కడక్కడా ధాన్యం తడుస్తున్నదని, ప్రభుత్వం తడిసిన ధాన్యాన్ని సైతం కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని ఎంపీపీ కర్రె మాధవీగౌడ్ అన్నారు. మండల పరిధిలోని రుద్రారం గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సోమవారం ఆమె పరిశీలించారు. కొనుగోలు కేంద్రం వద్ద సౌకర్యాలను పరిశీలించి, రైతులకు ఏమైనా సమస్యలు ఎదురైతే వెంటనే పరిష్కరించాలని వ్యవసాయ విస్తీర్ణాధికారి రవీందర్కు సూచించారు. ఆమెవెంట సర్పంచ్ సత్యం, ఏఈవో రవీందర్, రైతులు, కొనుగోలు కేంద్రం సిబ్బంది తదితరులు ఉన్నారు.
రైతులకు ఇబ్బందులు లేకుండా కొనుగోలు
నిజాంసాగర్ మండలంలోని అచ్చంపేట, గున్కుల్, మల్లూర్ సహకార సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తహసీల్దార్ వేణుగోపాల్ అన్నారు. మండలంలోని వెల్గనూర్ గ్రామ శివారులో ఉన్న కేతకి రైస్మిల్ను అచ్చంపేట సొసైటీ చైర్మన్ నర్సింహారెడ్డితో కలిసి సోమవారం ఆయన పరిశీలించారు. కొనుగోలు కేంద్రాల ద్వారా వస్తున్న ధాన్యంలో ఎంత మేరకు తరుగు తీస్తున్నారని రైస్మిల్ యజమాని నవీన్ను అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట డిప్యూటీ తహసీల్దార్ సత్యనారాయణ ఉన్నారు.
తిమ్మానగర్లో..
పిట్లం మండలంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని ఏఈవో ప్రదీప్ అన్నారు. తిమ్మానగర్ గ్రామంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని సోమవారం ఆయన పరిశీలించారు. ధాన్యాన్ని ఎప్పటికప్పుడు తూకం వేయాలని నిర్వాహకులకు సూచించారు. ఆయన వెంట విండో సీఈవో అశోక్గౌడ్ ఉన్నారు.