సంగారెడ్డి కలెక్టరేట్, మే 21: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘మనఊరు-మనబడి’ కార్యక్రమం అందరిదని సంగారెడ్డి కలెక్టర్ హనుమంతరావు స్పష్టం చేశారు. ఎక్కడా నాసిరకం పనులు జరిగినా సహించేది లేదని హెచ్చరించారు. పాఠశాలల ప్రారంభం నాటికి పనులు పూర్తి కావాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లోని సమావేశం మందిరంలో మనఊరు-మనబడి, దళిత బంధు, పల్లె ప్రగతి, గ్రామీణ క్రీడా ప్రాంగణాల ఏర్పాటు తదితర కార్యక్రమాలపై కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 25లోగా నియోజకవర్గానికి 2 మోడల్ స్కూల్స్ సిద్ధం చేయాలని పేర్కొన్నారు. మన ఊరు-మన బడి కార్యక్రమం అత్యంత ప్రాధాన్యతా కార్యక్రమం అని గుర్తు చేశారు. ఇందుకోసం ప్రభుత్వం దాదాపు రూ.7వేల కోట్లు ఖర్చు చేస్తుందన్నారు. విద్యార్థులు మెరుగైన వసతులు, ఆహ్లాదకరమైన వాతావరణంలో చదువుకునేలా సంబంధిత అధికారులు ప్రత్యేక దృష్టి సారించి విధులు నిర్వర్తించాలన్నారు. నాసిరకం పనులు సహించేది లేదన్నారు. జిల్లాలో తొలి విడతలో 441 పాఠశాలల్లో చేపట్టిన పనులు 100 శాతం నాణ్యతతో వేగవంతంగా పూర్తి చేయాలన్నారు. రూ.30 లక్షలలోపు పాఠశాలల పనులన్నీ వెంటనే పూర్తి కావాలన్నారు. రూ.30 లక్షల పైబడిన పాఠశాలల పనులకు టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి, పనులు ప్రారంభించాలని స్పష్టం చేశారు. మండలాల వారీగా ఆయా పనుల పురోగతిని కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ఎంపీడీవోలు ఏఈల వద్ద జాబితా తీసుకొని సంబంధిత పాఠశాలలను పర్యవేక్షించాలని సూచించారు.
31లోగా దళితబంధు యూనిట్లు గ్రౌండింగ్ చేయాలి
దళితబంధు పెండింగ్ యూనిట్లను ఈ నెల 31లోగా పూర్తి చేయాలని సంబంధిత ఎంపీడీవోలను కలెక్టర్ ఆదేశించారు. నియోజకవర్గం వారీగా డైరీ, గొర్రెలు, కోళ్ల యూనిట్లకు సంబంధించి షెడ్లు వేయడం, బోర్ డ్రిల్లింగ్ చేయడం, మోటర్లు బిగించి కరెంట్ కనెక్షన్ ఇప్పించడం వంటి పనులన్నీ పూర్తి చేయాలన్నారు. జూన్ మొదటి వారంలోగా పాడి గేదెలను కొనుగోలు చేయాలని తెలిపారు. షెడ్లు పూర్తి కావడంతోనే కోళ్లు, గొర్రెలు, గేదెలను వెంటనే తీసుకురావాలని సూచించారు. దళితబంధు లబ్ధిదారులతో మాట్లాడి, వారు ఎంచుకున్న యూనిట్తో ఏవిధంగా వారి జీవనం కొనసాగుతున్నది, ప్రతి నెల ఎంత ఆదాయం వస్తున్నది, ఆ ఆదాయాన్ని సక్రమంగా వినియోగిస్తున్నారా, దళిత బంధుకు ముందు ఏ విధంగా ఉన్నారు, లబ్ధి పొందిన తరువాత ఏ విధంగా అభివృద్ధి చెందుతున్నారనే విషయాలను తెలుసుకోవాలని వివరించారు. వచ్చే ఆదాయాన్ని దుర్వినియోగం చేసుకోకుండా సలహాలు, సూచనలు చేస్తూ వారి అభివృద్ధికి ఎప్పటికప్పుడు దిశా నిర్దేశం చేయాలన్నారు. లబ్ధిదారులతో క్రమం తప్పకుండా మాట్లాడాలని హితవు చేశారు. పథకం కోసం డబ్బులు నిల్వ ఉన్నాయని, ఎలాంటి ఇబ్బందులు లేవని కలెక్టర్ పేర్కొన్నారు. వారం రోజుల్లో అన్ని గ్రౌండింగ్ పూర్తి చేయాలన్నారు. విద్యుత్, బోర్వెల్ తదితర విషయాలను వివరించాలని, అన్ని కూడా లబ్ధిదారుల సమ్మతితోనే జరగాలని కలెక్టర్ స్పష్టం చేశారు. గొర్రెల యూనిట్లకు సంబంధించి వేగవంతం చేయాలని పశు సంవర్థకశాఖ జేడీ వసంతకుమారికి సూచించారు.
ఈ నెల 25లోగా క్రీడా ప్రాంగణాలు సిద్ధం చేయాలి
క్రీడాకారులను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టిందని కలెక్టర్ తెలిపారు. జిల్లాలో క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ఈ నెల 25లోగా జిల్లాలోని ప్రతి మండలంలో రెండు క్రీడా ప్రాంగణాలను ఆదర్శంగా తయారు చేసి అందించాలని ఎంపీడీవోలను ఆదేశించారు. గ్రామీణ క్రీడా కమిటీలను ఏర్పాటు చేయాలని వెల్లడించారు. క్రీడా ప్రాంగణాలకు సంబంధించిన ఆయా పనులను వేగంగా పూర్తి చేసేలా చొరవ చూపాలన్నారు.
జూన్ 3 నుంచి పల్లె ప్రగతికి సిద్ధం కావాలి
వచ్చే నెల 3వ తేదీ నుంచి పల్లె ప్రగతికి సిద్ధం కావాలని కలెక్టర్ సూచించారు. పంచాయతీ కార్యదర్శులు బాధ్యతగా విధులు నిర్వర్తించాలన్నారు. జిల్లాలో పల్లె ప్రగతి విజయవంతం చేయడంలో అధికారులందరూ భాగస్వాములు కావాలని కోరారు. సమావేశంలో అదనపు కలెక్టర్ రాజర్షి షా, డీఆర్డీడీవో శ్రీనివాసరావు, పశు సంవర్థకశాఖ జేడీ వసంతకుమారి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ బాబూరావు, ఉద్యానవనశాఖ అధికారి సునీత, ఆయా శాఖల అధికారులు, ఇంజినీర్లు, ఎంపీడీవోలు తదితరులు పాల్గొన్నారు.