రెండు ట్యాంకుల ద్వారా ఇంటింటికీ మిషన్ భగీరథ నీళ్లు
మూడు అంగన్వాడీ కేంద్రాలు, వందశాతం మరుగుదొడ్లు
ఆకట్టుకుంటున్న పల్లె ప్రకృతి వనం,హరితహారం మొక్కలు
తుదిదశకు చేరుకున్న గ్రామపంచాయతీ, డ్వాక్రా భవనం
త్వరలో 60 మంది లబ్ధిదారులకు డబుల్ ఇండ్లు
చివరి దశకు చేరిన ఇండ్ల నిర్మాణ పనులు
గ్రామంలో 20 సీసీ కెమెరాల ఏర్పాటు
కొనసాగుతున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు
చెర్యాల్ గ్రామం అభివృద్ధిలో ముందున్నదని చెప్పవచ్చు. ఇప్పటికే గ్రామంలో వంద శాతం మరుగుదొడ్లు పూర్తి చేసుకున్నది. మిషన్ భగీరథ రెండు ట్యాంకుల ద్వారా ప్రతి రోజుకు ఇంటింటికీ తాగునీటి అందజేస్తున్నారు. రూ.16 లక్షల గ్రామ పంచాయతీ ప్రత్యేక నిధులతో నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని నిర్మిస్తున్నారు. రెండంతస్తుల్లో ఇదే భవనంలో అన్ని వసతులతో పంచాయతీ, డ్వాక్రా మహిళా సంఘం భవనాన్ని ఒకే చోట నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ నిర్మాణ పనులు పూర్తి కావచ్చాయి. హరితహారంలో భాగంగా పలు విడుతల్లో నాటిన మొక్కలు ఇప్పుడు పెద్దచెట్లుగా ఎదిగి పచ్చదనంతో కళకళలాడుతున్నది. పల్లె ప్రకృతి వనాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ రోజూవారీగా మొక్కలను ప్రత్యేక ట్యాంకర్ ద్వారా నీటిని అందజేస్తున్నారు. అలాగే, వైకుంఠధామాన్ని కూడా నిర్మించారు. పక్కనే తడి, పొడి చెత్తను వేరే చేసేందుకు డంపింగ్యార్డు ఏర్పాటు చేయడంతో చెత్తను అక్కడ వేరు చేస్తున్నారు. ప్రస్తుతం గ్రామంలో రూ.20 లక్షల జీపీ నిధులతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు కొనసాగుతున్నాయి. అలాగే, సర్పంచ్ ప్రత్యేక చొరువతో పంట పొలాలకు వెళ్లే దారిలో కల్వర్టు నిర్మాణం చేపట్టి రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తున్నారు.
గ్రామంలో 20 సీసీ కెమెరాలు…
గ్రామాభివృద్ధిలో భాగంగా ప్రత్యేక నిధులతో 20 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఇందులో 18 గ్రామంలో ప్రధాన కూడళ్ల వద్ద ఏర్పాటు చేయగా, మరో 2 ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో ఏర్పాటు చేయించారు. గ్రామంలో తెలుగు, ఇంగ్లిష్ మీడియం ప్రభుత్వ పాఠశాల కూడా ఉన్నది. ఇక్కడే ఎంతో మంది విద్యార్థులు ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు విద్యాభాస్యం చేస్తున్నారు.
దరఖాస్తులు స్వీకరిస్తున్నాం…
ఉన్నతాధికారుల ఆదేశాలతో గ్రామంలో అర్హులైన వారి నుంచి త్వరలో ప్రారంభించనున్న డబుల్ ఇండ్ల కోసం దరఖాస్తులను స్వీకరించాం. గ్రామంలో ఇతర అభివృద్ధి కార్యక్రమాలు కూడా బాగానే జరుగుతున్నాయి.
గ్రామ వివరాలు…
గ్రామంలో మొత్తం జనాభా 2873 మంది ఉన్నారు. ఇందులో పురుషులు 1448, మహిళలు 1425 మంది ఉండగా, 2240 ఓటర్లు ఉన్నారు. గ్రామ విస్తీర్ణం మొత్తం 3622 ఎకరాల్లో ఉన్నది. అలాగే, గ్రామంలో 306 మంది అన్ని రకాల పింఛన్లు ప్రతి నెలా అందుకుంటున్నారు.
ప్రభుత్వ సహకారంతో అభివృద్ధి….
గ్రామంలో అభివృద్ధి పనులు జోరుగా కొనసాగుతున్నాయి. వైకుంఠధామం, డంపింగ్యార్డు, పల్లె ప్రకృతి వనం ఏర్పాటు చేశాం. హరితహారంలో భాగంగా మొక్కలను నాటాం. త్వరలోనే గ్రామంలో అర్హులైన నిరుపేదలకు డబుల్ బెడ్రూం ఇండ్లను అందజేయనున్నాం. ప్రస్తుతం జీపీ నిధులతో అండర్గ్రౌండ్ డ్రైనేజీ పనులు సాగుతున్నాయి. అందరి సహకారంతో ముందుకు సాగి గ్రామాన్ని ఆదర్శంగా నిలబెట్టాలన్నదే లక్ష్యం.
పేదలకు డబుల్ బెడ్రూం ఇండ్లు..
ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్రూం ఇండ్లు అర్హులైన నిరుపేదలకు సొంత ఇంటి కలను సాకారం చేస్తున్నది. చెర్యాల్ గ్రామంలో మొత్తం 60 డబుల్ ఇండ్లు నిర్మాణానికి మంజూరయ్యాయి. ఇప్పటికే 90 శాతం నిర్మాణ పనులు పూర్తి కాగా, త్వరలోనే లబ్ధిదారులకు అందించేందుకు అధికారులు దరఖాస్తులను స్వీకరిస్తున్నారు.