నారాయణఖేడ్, మే 13: కరోనా కేసులు పెరిగిపోతున్న కారణంగా ప్రభుత్వం విధించిన లాక్డౌన్ను జిల్లా వ్యాప్తంగా కట్టుదిట్టంగా అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని సంగారెడ్డి ఎస్పీ చంద్రశేఖర్రెడ్డి తెలిపారు. గురువారం ఎస్పీ నారాయణఖేడ్ను సందర్శించి లాక్డౌన్ పరిస్థితులపై స్థానిక డీఎస్పీ సత్యనారాయణరాజు, ఇతర పోలీసు అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు సడలింపులు ఇవ్వడంతో లాక్డౌన్ సజావుగా కొనసాగుతుందన్నారు. జిల్లాలోని రాష్ట్ర సరిహద్దులైన కంగ్టి, నాగల్గిద్ద, జహీరాబాద్ తదితర ప్రాంతాల్లో చెక్పోస్టులను ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహిస్తున్నామన్నారు. ప్రభుత్వ మార్గదర్శకాలననుసరించి అత్యవసర సేవలకు సంబంధించిన వాహనాలను మాత్రమే రాష్ట్ర సరిహద్దుల వద్ద అనుమతిస్తున్నామన్నారు. కొవిడ్ నిబంధనలను అతిక్రమించిన సంఘటనలకు సంబంధించి పక్షం రోజులుగా జిల్లాలో సుమారు 3 వేల కేసులు నమోదు చేశామని, ప్రస్తుత లాక్డౌన్ సందర్భంగా నిబంధనలను ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేస్తున్నట్లు ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. కరోనాను పూర్తి స్థాయిలో అరికట్టే దిశగా ప్రతి ఒక్కరూ భౌతికదూరం పాటించడం, విధిగా మాస్క్లు ధరించడం, శానిటైజర్ వినియోగించడం వంటి జాగ్రత్తలు పాటించాలని, లాక్డౌన్ సజావుగా కొనసాగేందుకు ప్రజలు సహకరించాలని ఎస్పీ కోరారు. ఆయనవెంట డీఎస్పీ సత్యనారాయణరాజు, నారాయణఖేడ్ సీఐ రవీందర్రెడ్డి, ఎస్ఐ వెంకట్రెడ్డి ఉన్నారు.
మొక్క నాటిన ఎస్పీ చంద్రశేఖర్రెడ్డి
నారాయణఖేడ్లో డీఎస్పీ కార్యాలయ భవనాన్ని ప్రారంభించిన తర్వాత తొలిసారిగా నారాయణఖేడ్కు వచ్చిన ఎస్పీ చంద్రశేఖర్రెడ్డి డీఎస్పీ కార్యాలయ భవనాన్ని పరిశీలించారు. భవన నిర్మాణానికి సంబంధించి స్థలాన్ని కేటాయించడం మొదలుకుని నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తిచేసి భవనాన్ని ప్రారంభించడంపై ఎస్పీ సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ డీఎస్పీ కార్యాలయ ఆవరణలో మొక్క నాటారు.