సిద్దిపేట, మే 9: కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే మైనార్టీలకు అన్నివిధాలుగా మేలు జరిగిందని మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. గురువారం సిద్దిపేట పట్టణంలోని కొండాభూదేవి గార్డెన్లో ఏర్పాటుచేసిన ముస్లిం మైనార్టీల సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ ఫరూక్ హుస్సేన్తో కలిసి హరీశ్రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వెంకట్రామిరెడ్డి చదువుకున్న వ్యక్తి అని, జిల్లా కలెక్టర్గా ప్రజలకు మంచిసేవ చేసిన వ్యక్తి అని, ఆయన గెలిపించుకుందామన్నారు. ఎంపీ, ఎమ్మెల్యేలు ఒకేపార్టీ వ్యక్తులు ఉంటే ప్రజలకు మరింత మేలు జరుగుతుందన్నారు. తెలంగాణలో ముస్లిం మైనార్టీల సంక్షేమానికి బీఆర్ఎస్ కృషి చేసిందని, మైనార్టీ రెసిడెన్షియల్ సూళ్లను 204 పెంచినట్లు గుర్తుచేశారు.
పార్లమెంట్ ఎన్నికలు అయిపోయిగానే బీజేపీ, కాంగ్రెస్ నాయకులు ఎవరూ మీకు అందుబాటులో ఉండరని, మళ్లీ మీకు అందుబాటులో ఉండేది తాను, బీఆర్ఎస్ పార్టీ నాయకులే అని హరీశ్రావు పేర్కొన్నారు. హిందూ, ముస్లింలు రెండు కండ్లలాగా తాను పనిచేస్తున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం గ్యారంటీలను అమలు చేయడం లేదన్నారు. కేసీఆర్ వల్లనే సిద్దిపేటకు రైలు, నీళ్లు, 24 గంటల కరెంట్ వచ్చిందన్నారు. ఒకప్పుడు సిద్దిపేటలో తాగునీరు లేక పిల్లని ఇవ్వాలంటే భయపడ్డారన్నారు. అట్లాంటి సిద్దిపేటను నేడు ఏవిధంగా అభివృద్ధి చేశామో ఆలోచన చేయాలన్నారు. హైదరాబాద్ తర్వాత సిద్దిపేటలోనే హజ్హౌస్ను నిర్మించినట్లు హరీశ్రావు గుర్తుచేశారు. తాను సొంతంగా ఏటా పదిమందిని ఉమ్రాకు పంపిస్తున్నట్లు చెప్పారు. సిద్దిపేటలో 650 మంది మైనార్టీలకు డబుల్ బెడ్రూం ఇండ్లను ఇచ్చామన్నారు.
నేడు రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన అంతా రివర్స్ గేర్లో నడుస్తున్నదని విమర్శించారు. రేవంత్రెడ్డి 12 మంది మంత్రుల్లో ఒక ముస్లిం మైనార్టీకి స్థానం కల్పించలేదన్నారు. సిద్దిపేటలో శ్మశాన వాటిక కోసం తాను తన సొంత డబ్బులతో పట్టణ శివారులో మూడెకరాల భూమిని కొని, బోరు వేసి, ఫెన్సింగ్ ఏర్పాటు చేసి గేటు బిగించి ఇచ్చినట్లు హరీశ్రావు చెప్పారు. రంజాన్ పండుగ వస్తే తాను వచ్చి అందరినీ కలిసి శుభాకాంక్షలు తెలిపానన్నారు.
రంజాన్ పండుగకు దాతల సహకారంతో పాటు తన సొంత డబ్బులతో వేలాది మంది ముస్లిం నిరుపేదలకు నిత్యావసర సరుకులను అందజేశానని గుర్తుచేశారు. శుక్రవారం సిద్దిపేటలో జరిగే కేసీఆర్ రోడ్షోకు ప్రతిఒకరూ వచ్చి ఆశీర్వాదం ఇవ్వాలని హరీశ్రావు విజ్ఞప్తి చేశారు. సమావేశంలో మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు ఫక్రుద్దీన్, నాయకులు పూజలు వెంకటేశ్వరరావు, పాల సాయిరాం, కౌన్సిలర్లు అత్తర్ పటేల్, వజీరుద్దీన్, మోయిజ్, కల్వకుంట్ల మల్లికార్జున్, కో ఆప్షన్ సభ్యుడు సయ్యద్, జావిద్, వహీద్, అక్బర్ నవాజ్, జమ్ముఖాన్, అతిక్, ఖాజా మొహినుద్దీన్, బాబుజానీ, అజీజ్, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.