హైదరాబాద్, ఆగస్టు 6 (నమస్తేతెలంగాణ) : హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న జర్నలిస్టులకు ఇండ్ల స్థలాల ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని హైదరాబాద్ జర్నలిస్ట్స్ హౌసింగ్ సొసైటీల జాయింట్ యాక్షన్ కమిటీ (హెచ్జేహెచ్ఎస్జేఏసీ ) ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు గురువారం బషీర్బాగ్లోని కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. సీఎం రేవంత్రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి సూచన మేరకు అన్ని హౌసింగ్ సొసైటీలు ఏకం చేసి జేఏసీగా ఏర్పాటు చేశామని తెలిపారు.
అలాగే మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్రెడ్డి, సమాచార శాఖ కమిషనర్ ముకుందరెడ్డితో పలు దఫాలు సమావేశమై, ఆయా జర్నలిస్ట్స్ హౌసింగ్ సొసైటీల సమగ్ర సమాచారాన్ని వారికి అందించినట్టు జేఏసీ బాధ్యులు తెలిపారు. అయితే ఇండ్ల స్థలాల ప్రక్రియను వేగవంతం చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలని వారు కోరారు. సమావేశంలో జేఏసీ బాధ్యులు కే విరాహత్ అలీ, ఎస్ విజయ్కుమార్రెడ్డి, మురళీకృష్ణ, గోపరాజు, రవీంద్రబాబు, రాకేశ్రెడ్డి పాల్గొన్నారు.