ఖైరతాబాద్, ఆగస్టు 6: నిరుద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడకుండా.. పోరాటాలతో ఉద్యోగాలు సాధించుకోవాలని వక్తలు పిలుపునిచ్చారు. రేవంత్రెడ్డి రెండు లక్షల ఉద్యోగాలు ఎప్పుడు ఇస్తారని ప్రశ్నించారు. సోమాజిగూడ ప్రెస్క్లబ్లో గురువారం సాయంత్రం తెలంగాణ సమాఖ్య కన్వీనర్ కరుణాకర్ దేశాయ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో సంఘం సలహాదారుడు రఫీ మాట్లాడారు. రాష్ట్రంలో ఇటీవల నిరుద్యోగ యువత ఆత్మహత్యలు పెరుగడం తీవ్ర ఆందోళన కలిగిస్తున్నదని అన్నారు. ఉద్యోగ నియామకాలపై స్పష్టమైన రోడ్ మ్యాప్ ప్రకటించాలని డిమాండ్ చేశారు.
నిరుద్యోగ సంఘం ప్రతినిధి అస్మా మాట్లాడుతూ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రెండు లక్షల ఉద్యోగాలిస్తామంటూ రేవంత్రెడ్డి వెంట తిప్పించుకున్నాడని, ఇప్పుడు పెయిడ్ బ్యాచ్ అంటున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రశ్నించిన వారిని పెయిడ్ బ్యాచ్ అంటూ నిందలు వేసి ఉద్యోగాలు ఇవ్వకుండా ప్రభుత్వం దాటవేత ధోరణి ప్రదర్శిస్తున్నదని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్లోపు జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని, లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. నిరుద్యోగ సంఘం నేత జనార్దన్ మాట్లాడుతూ ఆత్మహత్యకు యత్నించిన నిరుద్యోగ యువతను ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు పరామర్శించి వారికి భరోసా కల్పించాలని అన్నారు.
నిరుద్యోగ సంఘం నాయకులు ఇంద్రానాయక్, కుమార్ మాట్లాడుతూ అటవీ శాఖతోపాటు పలు ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులకు ప్రత్యేక నోటిఫికేషన్లు విడుదల చేయాలని, ఏజెన్సీ ప్రాంతాల్లో రిజర్వేషన్ల అమలుపై ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. ఇటీవల జరిగిన డీఎస్సీ నియామకాల్లో ఏజెన్సీ ప్రాంతాల అభ్యర్థులు నష్టపోయారని, వారికి ప్రత్యేక డీఎస్సీ నిర్వహించాలని డిమాండ్ చేశారు.