రామచంద్రాపురం, మే 9: పదేండ్ల కేసీఆర్ పాలనలో ఎన్నడూ కరువు రాలేదని, రైతులు, ప్రజలు ఎలాంటి కష్టాలు లేకుండా సంతోషంగా జీవించారని, ఇప్పుడు కాంగ్రెస్ వచ్చి, కరువు, కష్టాలు తెచ్చిందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. గురువారం తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని విద్యుత్నగర్లో చైర్పర్సన్ లలితాసోమిరెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన రోడ్షోకు హరీశ్రావు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన ఐదు నెలల్లోనే కరెంటు, నీళ్ల కష్టాలు వచ్చాయన్నారు. కాంగ్రెస్ రాగానే కేసీఆర్ కిట్, రైతుబంధు, రైతుబీమా, కల్యాణలక్ష్మి, తులం బంగారం బంద్ అయిందని దుయ్యబట్టారు. రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ పూర్తిగా పడిపోయిందన్నారు.
ప్రజలకు ఆరు గ్యారెంటీలు ఇస్తామని ఒక్క గ్యారెంటీని కూడా అమలు చేయలేదని ఆరోపించారు. మహిళలకు రూ. 2,500 ఇస్తామని మోసం చేశారన్నారు. బీజేపీ ప్రభుత్వం పదేండ్లలో ఈ ప్రాంతానికి చేసిందేమీ లేదన్నారు. విదేశీ మార్కెట్లో క్రూ డాయిల్ తగ్గినా దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయని, గ్యాస్ ధర రూ.1200 లకు పెంచారని అన్నారు. కాంగ్రెస్, బీజేపీని నమ్ముకుంటే మనకు ఒరిగేది ఏమి ఉండదన్నారు. దేశంలో ఏ సీఎం కట్టని విధంగా రూ.వెయ్యి కోట్లతో కేసీఆర్ యాదాద్రి ఆలయాన్ని నిర్మించారని గుర్తుచేశారు. శతచండీ యాగాన్ని చేశారని చెప్పారు. దేవుళ్ల పేరు చెప్పి కేసీఆర్ ఎప్పుడు రాజకీయాలు చేయలేదన్నారు. ఆలయాలను అభివృద్ధి, దేవుళ్లకు ధూపదీప నైవేద్యాలకు నిధులు ఇచ్చిన హిం దూవాది కేసీఆర్ అని అన్నారు.
తెల్లాపూర్లో మున్సిపల్ భవనం, మార్కెట్ యార్డ్, దేవాలయాలు, తదితర అభివృద్ధి పనులకు రూ.500 కోట్లు విలువ చేసే భూమిని బీఆర్ఎస్ ప్రభు త్వం ఇచ్చిందన్నారు. సీఎం హోదాలో కేసీఆర్ తెల్లాపూర్కి మంజూరు చేసిన రూ.50కోట్లు నిధులను కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే వెనక్కి తీసుకుందని చెప్పారు.13వ తేదీన జరిగే ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డికి ఓటు వేసి గెలిపించాలని కోరారు. అంతకుముందు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి, ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి మాట్లాడారు. అనంతరం మాజీమంత్రి హరీశ్రావు, ఎమ్మె ల్యే, ఎంపీ అభ్యర్థిని గజమాలతో సత్కరించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ, శంకర్యాదవ్, మల్లారెడ్డి, బాబ్జీ, లచ్చిరాం, రవీందర్రెడ్డి, దేవేందర్యాదవ్, బుచ్చిరెడ్డి, శ్రీశైలం, శ్రీపాల్రెడ్డి, ఆదర్శ్రెడ్డి, అజీమ్, నర్సింహులు, నర్సింహ, బాలయ్య, యాదగిరి, సత్యనారాయణ, ప్రభాకర్యాదవ్, దయాకర్రెడ్డి, సాగర్ పాల్గొన్నారు.
– సంగారెడ్డి రోడ్షోలో హరీశ్రావు
సంగారెడ్డి, మే 9(నమస్తే తెలంగాణ): ఆరు గ్యారెంటీలు అమలుచేయకుండా మోసం చేస్తున్న అబద్ధాల కాంగ్రెస్కు ఎంపీ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని మాజీమంత్రి హరీశ్రావు అన్నారు. గురువా రం సంగారెడ్డిలోని అంబేద్కర్ చౌరస్తాలో ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ఆధ్వర్యంలో నిర్వహించిన రోడ్షోలో హరీశ్రావు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చకుండా పార్లమెంట్ ఎన్నికల్లో మళ్లీ ఓట్లు అడగటం సిగ్గుచేటన్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ మాత్రం అన్ని హామీలు అమలు చేశామని అబద్ధాలు చెప్పటం విడ్డూరంగా ఉన్నదన్నారు.
మహిళలకు రూ.2500 ఖాతాల్లో జమ చేస్తామని చెప్పి అమలు చేయకుండానే రాహుల్గాంధీ ఎన్నికల ప్రచారంలో మహిళల పేరిట బ్యాంకుల్లో ప్రతినెలా రూ.8500 జమచేస్తామని చెప్పటం హాస్యాస్పదంగా ఉన్నదన్నారు. రాహుల్గాంధీ, రేవంత్రెడ్డి మాటలను జనం నమ్మే పరిస్థితుల్లో లేరన్నారు. నిరంతరం ప్రజల పక్షాన నిలిచి పోరాడుతున్న బీఆర్ఎస్ను పార్లమెంట్ ఎన్నికల్లో గెలిపించాలని కోరారు. బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి పక్కా లోకల్ అని, రిటైర్డు ఐఏఎస్ అధికారిగా ఈ ప్రాంత ప్రజలకు ఎంతో సేవచేశారని తెలిపారు. అనంతరం వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ ఎంపీగా గెలిపిస్తే పార్లమెంట్లో ప్రజల గొంతుక అవుతానని తెలిపారు. ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ మాట్లాడుతూ సంగారెడ్డి నియోజకవర్గం నుంచి వెంకట్రామిరెడ్డికి భారీ మెజార్టీ ఇచ్చి గెలిపిస్తామని తెలిపారు.