చేర్యాల, మే 9: చేర్యాల గడ్డ ఉద్యమాలకు అడ్డా అని, ఈ ప్రాంత ప్రజలు ఓటుతో కాంగ్రెస్కు ఎంపీ ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు. గురువారం రాత్రి చేర్యాల పట్టణంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో భారీ రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి మాట్లాడుతూ.. అడ్డగోలు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కారు రాష్ట్రంలోని అన్నివర్గాల ప్రజలను మోసం చేసిందన్నారు. కాంగ్రెస్ సర్కారు చెరువులు నింపకపోవడంతో రైతుల పంటలు ఎండిపోయాయని, నియోజకవర్గంలోని రిజర్వాయర్లు, చెరువులు ఎండబెట్టి రైతుల నోట్లో మట్టికొట్టారని ఆవేదన వ్యక్తం చేశారు.
చేర్యాల, జనగామ ప్రజలకు అందుబాటులో ఉంటూ తన సొంత దవాఖానలో ఉచితంగా వైద్య సేవలు అందిస్తానని, దొంగ ఓట్లతో గెలిచానని కాంగ్రెస్ నాయకుడు కొమ్మూరి అంటున్నాడని, నియోజకవర్గంలో ఎక్కడ దొంగ ఓట్లు వేయలేదని ప్రజలు చెబుతున్నారని, మరి దొంగ ఓట్లు ఎవరు వేశారో ఎక్కడ వేశారో కాంగ్రెసోళ్ల్లకు తెలియాలన్నారు. అసెంబ్లీలో తనకు వచ్చిన మొదటి అవకాశంలోనే చేర్యాల రెవెన్యూ డివిజన్ గురించి ప్రస్తావించానని, అధికారం రాకముందు ఇక్కడ ప్రతిపక్షంలో ఉన్న చాలామంది నాయకులు అధికారం రాగానే రెవెన్యూ డివిజన్ మర్చిపోయారన్నారు. చేర్యాల రెవెన్యూ డివిజన్ చేసే వరకు విశ్రమంచేది లేదని ఆయన హామీ ఇచ్చారు. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి క్యామ మల్లేశ్ను అక్కున చేర్చుకుని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.
రాహుల్గాంధీ సంతకాన్ని ఫోర్జరీ చేయడమే కాకుండా ఆదిభట్లలో ప్లాట్లు ఆక్రమించిన భువనగిరి ఎంపీ కాంగ్రెస్ అభ్యర్ధి చామల కిరణ్కుమార్రెడ్డి ఓ కబ్జాకోరని బీఆర్ఎస్ భువనగిరి ఎంపీ అభ్యర్ధి క్యామ మల్లేశం ఆరోపించారు. కేసీఆర్ ఎంపీ టికెట్ల కేటాయింపులో సామాజిక న్యాయం పాటించారని, బీసీలకు అధిక ప్రాధాన్యత ఇచ్చారన్నారు. అత్యధిక జనాభా ఉన్న గౌడ, మాదిగ, గొల్లకురుమలకు కాంగ్రెస్ ఒక్క టికెట్ ఇవ్వలేదని, ఎన్నికల సమయంలో పార్టీ మారిన దొంగలకు టికెట్లు ఇచ్చారని విమర్శించారు.
బీజేపోళ్లు రైస్మిల్లు నుంచి బియ్యం తెచ్చి అక్షింతలు కలిపి ప్రజలను మోసం చేస్తున్నారని, వారిని నమ్మొద్దన్నారు. కేసీఆర్ యాదాద్రి నిర్మించి ఏనాడు రాజకీయాల కోసం నర్సింహస్వామిని వాడుకోలేదన్నారు. భువనగిరి ఎంపీలుగా పనిచేసిన కోమటిరెడ్డి బ్రదర్స్, బూరనర్సయ్య ఈ ప్రాంతానికి చేసిన అభివృద్ధి శూన్యమన్నారు. సామాన్య కుటుంబానికి చెందిన తనను ఆదరిస్తే ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డితో కలిసి ఈ ప్రాంత సమస్యలు పరిష్కరిస్తానని క్యామ మల్లేశ్ హామీ ఇచ్చారు. కార్యక్రమంలో చేర్యాల, కొమురవెల్లి, మద్దూరు, ధూళిమిట్ట మండలాలకు చెందిన బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి ఆధ్వర్యంలో చేర్యాలలో నిర్వహించిన రోడ్షో గ్రాండ్ సక్సెస్ కావడంతో బీఆర్ఎస్ శ్రేణుల్లో జోష్ నెలకొంది. చేర్యాల పట్టణం ప్రజలతో పాటు చేర్యాల, కొమురవెల్లి, మద్దూరు, ధూళిమిట్ట మండలాల నుంచి మహిళలు, యువకులు, కార్యకర్తలు భారీగా రోడ్షోకు తరలివచ్చారు. కొమురవెల్లి నుంచి ప్రారంభమైన రోడ్షో చేర్యాల పట్టణం నుంచి పట్టణ శివారు ముస్త్యాల వరకు కొనసాగింది. రోడ్ షోకు సుమారు 10వేల మంది తరలివచ్చినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. రోడ్డు పొడవునా మహిళలు మంగళహారతులు, యువకులు పటాకులు కాల్చి సందడి చేశారు.