హైదరాబాద్, జూలై 30 (నమస్తే తెలంగాణ) : సాంకేతిక లోపం.. ప్రతికూల వాతావరణం డైట్ లెక్చరర్స్ అభ్యర్థులకు శాపంగా మారింది. నిర్దేశిత గడువు ఈ నెల 29లోగా దరఖాస్తు చేయకపోవడంతో అరుదైన అవకాశం కోల్పోయే పరిస్థితి వచ్చింది. దరఖాస్తు గడు వు మూడు నుంచి ఐదు రోజులు పొడిగించాలని గురువారం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్కు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలోని ఉపాధ్యాయ శిక్షణ సంస్థల్లో 63 జూనియర్, 23 సీనియర్ లెక్చరర్ల భర్తీకి టీజీపీఎస్సీ ద్వారా 18 జూన్ 2026న నోటిఫికేషన్ జారీచేశారు. అదే నెల 24 నుంచి ఆన్లైన్లో దరఖాస్తు ప్రక్రియ ప్రారంభించారు. రూ.వెయ్యి ఫీజుతో 29వ తేదీ వరకు గడువు విధించారు. భారీ వర్షాలు, కరెంట్ కోతలు, నెట్వర్క్ సమస్యల కారణంగా దరఖాస్తు చేయలేకపోయామని వేలాదిమంది అభ్యర్థులు చెప్తున్నారు.
మారుమూల ప్రాంతాల్లోని వారికి తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయని పేర్కొంటున్నారు. ఈదురు గాలులతో సెల్టవర్లు దెబ్బతినడం, కేబుల్స్ తెగిపోవడంతో ఇంటర్నెట్ సేవలు స్తంభించాయని వాపోతున్నారు. మీ సేవా కేంద్రాలు సైతం పనిచేయలేదని పేర్కొంటున్నారు. సర్వీస్ కమిషన్ ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్ నంబర్లకు ఫోన్చేసినా, ఈమెయిల్స్ పంపినా స్పం దించలేదని ఆరోపిస్తున్నారు. గతంలో గ్రూప్ -1, గ్రూప్-2, హాస్టల్ వెల్ఫేర్ ఇతరత్రా పోటీ పరీక్షలకు దరఖాస్తు గడువు పొడిగించారు. ప్రస్తుతం మానవీయ కోణంలో స్పందించి డైట్ లెక్చరర్స్ ఎగ్జామ్ దరఖాస్తు గడువును పొడిగించాలని కోరుతున్నారు.