కరోనా రోగులకు ప్రభుత్వం అండ
ప్రభుత్వ దవాఖానల్లో మెరుగైన వైద్యసేవలు
సరిపడా ఆక్సిజన్ నిల్వలు
సంగారెడ్డిలోని సెంట్రల్ డ్రగ్ స్టోర్లో అందుబాటులో రెమిడెసివిర్, కొవిడ్ మందులు
కరోనా రోగికి నిత్యం రూ.250తో పౌష్టికాహారం
హైదరాబాద్కు పోకుండా ఇక్కడే వైద్యం అందించేందుకు అన్ని ఏర్పాట్లు
ఓపీ సేవలు ప్రారంభం
పర్యవేక్షిస్తున్న ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు
కరోనా రోగులకు ప్రభుత్వం అండగా నిలుస్తున్నది. కష్టకాలంలో వారికి సత్వరం మెరుగైన వైద్యసేవలు అందించేందుకు ఎప్పటికప్పుడు చర్యలు చేపడుతున్నది. దీనికి గాను ఉమ్మడి మెదక్ జిల్లాలోని ప్రభుత్వ దవాఖానల్లో ఆక్సిజన్ బెడ్లు పెంచుతున్నది. సరిపడా ఆక్సిజన్ నిల్వలను అందుబాటులో ఉంచుతున్నది. అత్యవసర పరిస్థితుల్లో అందజేసే రెమిడెసివిర్ ఇంజక్షన్లు, స్టెరాయిడ్స్, ఇతర మందులను సంగారెడ్డిలోని సెంట్రల్ డ్రగ్ స్టోర్లో అందుబాటులో ఉంచారు. ఇక్కడి నుంచి దవాఖానలకు అవసరం మేరకు సరఫరా చేస్తున్నారు. శుక్రవారం నుంచి అన్ని ప్రభుత్వ దవాఖానల్లో కరోనా రోగుల కోసం ఓపీ సేవలను ప్రారంభించింది. ఒక్క సంగారెడ్డి జిల్లాలోని ప్రభుత్వ దవాఖానల్లో 171 పడకలు అందుబాటులో ఉండగా, ఆయా దవాఖానల్లో 349 ఆక్సిజన్ పడకలు అందుబాటులో ఉన్నాయి. కరోనా రోగులు హైదరాబాద్ పోకుండా స్థానికంగానే మెరుగైన వైద్యం అందించాలని, ఎవ్వరూ ప్రైవేట్లో చేరి ఆర్థికంగా చితికి పోకుండా చర్యలు చేపట్టాలని మంత్రి హరీశ్రావు ఆదేశాలతో ఆ మేరకు అధికారులు ఏర్పాట్లు చేశారు.
సంగారెడ్డి, మే 9 (నమస్తే తెలంగాణ)
సంగారెడ్డి, మే 9 (నమస్తే తెలంగాణ) :
కష్టకాలంలో కరోనా రోగులకు ప్రభుత్వం అండగా నిలుస్తున్నది. వారికి సత్వరం మెరుగైన వైద్యసేవలు అందజేసేందుకు వీలుగా ప్రభుత్వ దవాఖానల్లో ఆక్సిజన్ బెడ్లు పెంచుతున్నది. పీహెచ్సీ మొదలు జిల్లా కేంద్ర దవాఖానలో సరిపోయే ఆక్సిజన్ నిల్వలను అందుబాటులో ఉంచుతున్నది. కరోనా రోగులకు అత్యవసర పరిస్థితుల్లో అందజేసే రెమిడెసివిర్ ఇంజక్షన్లు, స్టెరాయిడ్స్, ఇతర మందులను దవాఖానలకు సరఫరా చేస్తున్నది. దీనికి తోడు శుక్రవారం నుంచి ప్రభుత్వం అన్ని ప్రభుత్వ దవాఖానల్లో కరోనా రోగుల కోసం ఔట్ పేషెంట్ (ఓపీ) సేవలను సైతం ప్రారంభించింది. ప్రభుత్వ దవాఖానల్లోని వైద్యులు, సిబ్బంది సైతం మెరుగైన సేవలు అందజేస్తూ రోగుల్లో ప్రభుత్వ వైద్యంపై నమ్మకాన్ని పెంచుతున్నారు. దీంతో ప్రైవేట్ దవాఖానల్లో చేరి ఆర్థికంగా చితికిపోయేందుకు బదులుగా, కరోనా రోగులు జిల్లాలోని ప్రభుత్వ దవాఖానల్లో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇటీవల రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్రావు వైద్యాధికారులతో సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్ ఎవ్వరూ వెళ్లకుండా స్థానికంగానే కరోనా రోగులకు వైద్యసేవలు అందించాలని ఆదేశించారు. దీంతో వైద్యాధికారులు కరోనా రోగులు ఎవ్వరూ హైదరాబాద్ వెళ్లకుండా ప్రభుత్వ దవాఖానల్లోనే చికిత్స పొంది కోలుకునేలా చర్యలు తీసుకుంటున్నారు.
అందుబాటులో పడకలు, ఆక్సిజన్..
సంగారెడ్డిలోని జిల్లా కేంద్ర దవాఖానతో పాటు పటాన్చెరు, జోగిపేట, జహీరాబాద్, నారాయణఖేడ్, సదాశివపేట, ఓడీఎఫ్లోని దవాఖానల్లో కరోనా రోగులకు చికిత్స అందజేస్తున్నారు. కొవిడ్ రోగులకు చికిత్స అందజేసేందుకు వీలుగా సంగారెడ్డి జిల్లాలోని ప్రభుత్వ దవాఖానల్లో 171 పడకలు అందుబాటులో ఉన్నాయి. ఆయా దవాఖానల్లో 349 ఆక్సిజన్ పడకలు కరోనా రోగుల కోసం అందుబాటులో ఉంచారు. ప్రస్తుతం 141 మంది కరోనా రోగులకు ఆక్సిజన్ అందజేస్తున్నారు. ఏడు ప్రభుత్వ దవాఖానల్లో 22 ఐపీయూ పడకలు ఉన్నాయి. ఐసీయూలో వెంటిలేటర్ల సౌకర్యం ఉన్న పడకలు 21 అందుబాటులో ఉంచారు. సంగారెడ్డి జిల్లాలోని ఆరు ప్రభుత్వ దవాఖానల్లో కరోనా రోగులకు చికిత్స కోసం 569 పడకలు ఉన్నాయి. వీటిల్లో ప్రస్తుతం 200 మంది రోగులు చికిత్స పొందుతుండగా, 369 పడకలు అందుబాటులో ఉన్నాయి. సంగారెడ్డి జిల్లాకేంద్ర దవాఖానలో ఆక్సిజన్ ప్లాంటు ఉంది. ఇక్కడ 180 పడకలకు ఆక్సిజన్ సౌకర్యం అందుబాటులో ఉంది. పటాన్చెరు, జోగిపేట ప్రభుత్వ దవాఖానల్లో 70 పడకలకు ఆక్సిజన్ సౌకర్యం కల్పించారు. త్వరలో నారాయణఖేడ్, జహీరాబాద్, సదాశివపేట దవాఖానల్లో 70 పడకలకు ఆక్సిజన్ సౌకర్యం కల్పించనున్నారు. సిలిండర్ల ద్వారా ఆక్సిజన్ సరఫరా చేసేందుకు బదులుగా అన్ని దవాఖానల్లో ఆక్సిజన్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు నిర్ణయం తీసుకున్నారు. దీంతో దశల వారీగా అన్ని ప్రభుత్వ దవాఖానల్లో ఆక్సిజన్ ప్లాంట్లు ఏర్పాటు కానున్నాయి. ప్రస్తుతం సంగారెడ్డి జిల్లాలో 13 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ అందుబాటులో ఉంది.
అందుబాటులో రెమిడెసివిర్ సహా
అన్ని మందులు..
కరోనా రోగులకు అత్యవసరంగా అందజేసే రెమిడెసివిర్ ఇంజక్షన్లతో సహా ఇతర అన్నిరకాల మందులను ప్రభుత్వం సర్కారు దవాఖానల్లో అందుబాటులో ఉంచుతున్నది. ప్రస్తుతం సంగారెడ్డి ప్రభుత్వ దవాఖానతో పాటు ఇతర దవాఖానల్లో 180 రెమిడెసివిర్ వైల్స్ అందుబాటులో ఉన్నాయి. అత్యవసరమైన రోగులకు మాత్రమే రెమిడెసివిర్ ఇస్తామని, సెంట్రల్ డ్రగ్ స్టోర్లో తగినన్ని రెమిడెసివిర్ ఇంజక్షన్లు అందుబాటులో ఉన్నాయని సంగారెడ్డి జిల్లా వైద్యాధికారి గాయత్రీదేవి తెలిపారు. కరోనా కిట్లు 3000 అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. త్వరలో మరో 2000 వేలు జిల్లాకు రానున్నట్లు చెప్పారు. ప్రతిరోజు జిల్లాకు అవసరమైన కరోనా కిట్లు వస్తున్నట్లు తెలిపారు. కరోనా రోగనిర్ధారణ అయిన రోగులకు కిట్స్ అందజేస్తున్నారు. ప్రభుత్వ దవాఖానల్లో అందజేస్తున్న వైద్యసేవలపై రోగులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ దవాఖానల్లో చికిత్సపొందుతున్న రోగులకు పౌష్టికాహారం అందజేస్తున్నారు. ఇందుకోసం ప్రతి రోగికి రోజుకు రూ.250 ఖర్చు చేస్తున్నారు. ఉదయం అల్పాహారంతో పాటు మధ్యాహ్నం భోజనం, సాయం త్రం స్నాక్స్, రాత్రి భోజనం పెడుతున్నారు. రోగులకు రుచికరమైన పౌష్టికాహారం అందేలా వైద్యాధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
ఔట్పేషెంట్ సేవలు ప్రారంభం..
హోం ఐసొలేషన్లో ఉంటూ చికిత్స పొందుతున్న కరోనా రోగులు ప్రభుత్వ దవాఖానల్లో ఔట్ పేషెంట్ (ఓపీ) సేవలు పొందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. సంగారెడ్డి జిల్లాలోని జిల్లా కేంద్ర దవాఖాన, అర్బన్ హెల్త్సెంటర్, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లతో పాటు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సైతం శుక్రవారం నుంచి కరోనా రోగులకు ఔట్పేషెంట్ సేవలను ప్రారంభించారు. హోం ఐసొలేషన్ ఉన్నవారికి ఔట్పేషెంట్ సేవలు అందించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లును వైద్య ఆరోగ్యశాఖ చేపట్టింది.
మెరుగైన వైద్యసేవలు..
ప్రభుత్వ దవాఖానల్లో కరోనా రోగులకు మెరుగైన వైద్య సేవలు అందజేస్తున్నాం. కరోనా సోకి ప్రభుత్వ దవాఖానల్లో చేరిన వారిని నిరంతరం వైద్యులు పర్యవేక్షిస్తూ సేవలు అందిస్తున్నారు. రోగులు త్వరగా కోలుకునేలా వైద్య సిబ్బంది శ్రద్ధ తీసుకుంటున్నారు. కరోనా చికిత్సకు అవసరమైన అన్ని ఇంజక్షన్లు, మందులు అందుబాటులో ఉన్నాయి. ప్రభుత్వ దవాఖానల్లో చేరుతున్న కరోనా రోగుల సంఖ్య పెరుగుతున్నది. కరోనా రోగులు హైదరాబాద్ వెళ్లాల్సిన అవసరం లేదు. ఇక్కడే వైద్యం పొందాలి.
గాయత్రీదేవి, ఇన్చార్జి డీఎంహెచ్వో సంగారెడ్డి