సంగారెడ్డి, జూన్ 6 : వానకాలం పంట సాగుకు అన్నదాతలు సమాయత్తమవుతున్న సమయంలో విత్తనాలు కొనుగోళ్లలో రైతులు జాగ్రత్తలు పాటించాలి. ముఖ్యంగా రైతులు వానకాలం రాగానే విత్తనాలు వేసేందుకు తొందర పడొద్దు. రైతుల సమయాన్ని అసరాగా తీసుకుని విత్తనాలు, ఎరువులు విక్రయించే దుకాణాదారులు నఖిలీ విత్తనాలు అంటగట్టె ప్రయత్నం చేస్తారు. అలా కాకుండా జాగ్రత్తలు పాటించాలి. లైసెన్స్ ఉన్న సీడ్ దుకాణాల్లో విత్తనాలు కొనాలి. కొన్న తర్వాత డీలర్ సంతకం, రైతు సంతకం రసీదుపై చేయించుకుని తీసుకోవాలి. డీలర్ నుంచి తీసుకున్న బిల్ రసీదును పంటలు పూర్తయ్యే వరకు భద్రపర్చుకోవాలి. రైతులు దుకాణాల యజమానుల మాటలు నమ్మి మోసపోద్దు. గడ్డి మందు లేకున్నా దిగుబడి వస్తుందని, చెప్పి హెచ్ టీ పత్తి విత్తనాలు అంటగట్టె ప్రయత్నం చేస్తారు. ఆ విత్తనాలను కేంద్ర ప్రభుత్వం నిషేధించిందని, ఈ విషయం రైతులు గుర్తించాలని అధికారులు రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. వర్షాలు పడగానే మొలకెత్తిన సోయాబీన్ విత్తనాలు వేసుకుంటే మెరుగైన దిగుబడులు వస్తాయని అధికారులు చెబుతున్నారు. సోయాబీన్లో 65శాతం అంటే వందకు 65 అంతకు మించి మొలకలు వస్తేనే విత్తనాలు వేసుకోవాలి. ఎక్కడైన నఖీలీ విత్తనాలు అమ్ముతున్నట్లు రైతుల దృష్టికి వస్తే వెంటనే మండల వ్యవసాయ అధికారులు, స్థానిక ఎస్సైలకు సమాచారం ఇవ్వాలి.
గ్రామాల్లో ఇచ్చే విత్తనాలు కొనొద్దు..
పట్టణాల్లో డీలర్లు, సీడ్ దుకాణాల యజమానులు పత్తి విత్తనాలు సరఫరా చేస్తామని, పత్తి పంట అయిన తర్వాత డబ్బులు తీసుకుంటామని నమ్మబలికి గ్రామాల్లో తిరుగుతూ ఇచ్చే విత్తనాలు కొనుగోలు చేయొద్దు. లైసెన్స్ లేకుండా, రైతులకు బిల్లులు ఇవ్వకుండా విత్తనాలు అమ్మాలని చూస్తే వెంటనే వ్యవసాయశాఖ అధికారులకు సమాచారం అందించాలి. గ్రామాల్లో విత్తనాలు విక్రయించే వారి వివరాలు అందించిన వారి సమాచారం గోప్యంగా ఉంచుతామని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. కొవిడ్-19 నిబంధనలు పాటిస్తూ రైతులు పత్తి, విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేయాలి. దుకాణ యజమానులు దుకాణాల ఎదుట శానిటైజర్ అందుబాటులో ఉంచాలి. విత్తనాలు, ఎరువులకు దుకాణాలకు వెళ్లినప్పుడు రైతులు మాస్క్తో పాటు భౌతికదూరం పాటించాలి. రైతులు పంటల సాగుకు సన్నద్ధం కావడానికి రుతుపవనాలు రాష్ట్రంలో ప్రవేశించి వర్షాలు పడితేనే పంటలు వేసుకోవాలని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. తేలిక పాటి నేలల్లో 50-60 మిల్లిమీటర్లు, బరువైన నల్ల రేగడి భూమిలో 60-75 మిల్లి మీటర్ల వర్షం నమోదైన అనంతరం 15-20 సెంటిమీటర్ల వర్షం పడితే (నాగలి లోతు) భూమి తడిస్తేనే పంటలు వేయడానికి అనువుగా ఉంటుంది. ఈ విషయం అన్నదాతలు గమనించి పంటల సాగు చేసుకుని అధిక దిగుబడులు సాధించి ఆర్థిక పరిపుష్టి సాధించాలని వ్యవసాయశాఖ అధికారులు సూచిస్తున్నారు.