BRS | హైదరాబాద్, ఏప్రిల్ 26 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీకగా అవతరించి యావత్దేశాన్ని మంత్రముగ్ధం చేసిన చరిత్ర బీఆర్ఎస్ది. ప్రత్యేక రాష్ట్ర సాధనే ధ్యేయంగా 23 ఏండ్ల క్రితం జలదృశ్యంలో పురుడుపోసుకున్న బీఆర్ఎస్ పార్టీ 14 ఏండ్ల సుదీర్ఘ పోరాటాల ఫలితంగా తన లక్ష్యాన్ని ముద్దాడటం ఓ అపూర్వఘట్టం. 23 ఏండ్ల ప్రస్థానంలో దాదాపు 14 ఏండ్లు రాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం సాగించి, ప్రత్యే క రాష్ర్టాన్ని సాధించిన బీఆర్ఎస్, రాష్ట్ర ఆవిర్భావ అనంతరం తొలి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది. తొమ్మిదిన్నరేండ్లపాటు అధికారంలో కొనసాగింది. ఆ స్వల్పకాలంలోనే పరిపాలనలో అద్భుతాలు చేసి చూపించింది. అనేక రంగాల్లో దేశంలోనే నంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్ది తెలంగాణ కీర్తిని ఎలుగెత్తి చాటింది. బీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖర్రావు లిఖించిన ఆ అసాధారణ చరిత్రకు భవిష్యత్తు లేకుండా చేస్తాననే వాదనలు ఇప్పుడే కాదు, అప్పుడూ వినిపించాయి. అసలు పార్టీ నే లేకుండా చేస్తామన్న వాళ్లు, చేయాలని కుతూహలం ప్రదర్శించినవాళ్లు చతికిలపడిపోవడం, ఈ గడ్డ నుంచి వేరుపడిపోవడం మన కండ్ల ముందే జరిగింది. అసమాన వ్యూహ చతు రత, అద్వితీయ కార్యదీక్షగల కేసీఆర్ చేతిలో బీఆర్ఎస్ పదిలంగా పదునెక్కి ముందుకు సాగుతున్నది. 2001 ఏప్రిల్ 27న జలదృశ్యంలో ఎగురవేసిన గులాబీ జెండా దిగ్విజయంగా 23 ఏండ్లు పూర్తిచేసుకొని 24వ ఏట అడుగుపెడుతున్నది. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు, అస్తిత్వమే ప్రాతిపదికగా ఏర్పడిన బీఆర్ఎస్ అనేక ఎత్తుపల్లాలను చవిచూసింది.
పార్టీ ఆవిర్భావం నుంచి ఇప్పటివరకు ఏది చేసినా సంచలనమేనని బీఆర్ఎస్ నిరూపిస్తూ వస్తున్నది. చెల్లాచెదురుగా ఉన్న తెలంగాణ సమాజాన్ని ఏకం చేసి స్వరాష్ట్ర సమరంలో భాగస్వాములను చేసింది. దేశ రాజకీయాల్లో తమకు ఎదురేలేదని చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ పరాజయభారాలతో బిక్కచచ్చిపోయిన వేళ, 2004 లో బీఆర్ఎస్తో పెట్టుకున్న పొత్తే ఆ పార్టీకి ప్రాణం పోసింది. ‘తెలంగాణ కోసం గొంగలి పురుగునైనా ముద్దు పెట్టుకుంటా, కుష్టురోగినైనా కౌగిలించుకుంటా’అని నాడు కాంగ్రెస్తో పొత్తుపెట్టుకొని యూపీఏ కనీస ఉమ్మడి ప్రణాళికలో, రాష్ట్రపతి ప్రసంగంలో తెలంగాణ అంశాన్ని చేర్పించిన ఘనత కేసీఆర్దే. ఆనాడు ముందుచూపుతో అనుసరించిన వ్యూహమే 2009 డిసెంబర్ 9 ప్రకటనకు, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి దారితీసింది. 2001లో కరీంనగర్లో నిర్వహించిన సింహగర్జన బహిరంగసభ నుంచి, 2010 డిసెంబర్ 16న వరంగల్లో నిర్వహించిన తెలంగాణ మహాగర్జన దాకా తెలంగాణలోని దాదాపు ప్రతి మండలం, ప్రతి రెవెన్యూ డివిజన్లోనూ కేసీఆర్ నిర్వహించిన బహిరంగసభ లెన్నో. బస్తీబాట, పల్లెనిద్ర, తండానిద్రా ఇలా అనేక రూపాల్లో దాదాపు 14 ఏండ్లపాటు అవిశ్రాంత పోరాటం సాగించారు.
రాష్ట్ర ఆవిర్భావం తరువాత 2014 జూన్లో తొలి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసిన బీఆర్ఎస్ 2023 డిసెంబర్ వరకు ప్రభుత్వాన్ని సమర్థంగా నడిపింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోగానే ఇక ఆ పార్టీ పని అయిపోయిందనే వాతావరణాన్ని కృత్రిమంగా సృష్టించడం మొదలైంది. బీఆర్ఎస్కు చెందిన ఐదుగురు సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావ్తోపాటు కొద్దిమంది మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు బీఆర్ఎస్ పార్టీని వీడారు. లోక్సభ ఎన్నికల తరువాత బీఆర్ఎస్ను నామరూపాల్లేకుండా చేస్తామని, ఆ పార్టీ నుంచి గెలిచిన వారిని ఎవ్వరినీ మిగలనీయమని, 25 మంది ఎమ్మెల్యేలు తమతో టచ్లో ఉన్నారని కాంగ్రెస్ మంత్రులు భీషణ ప్రతిజ్ఞలు చేస్తున్నారు. ఇలాంటి ఆటుపోట్లు బీఆర్ఎస్కు కొత్తకాదు. ఎన్నో కుట్రలను తిప్పికొడుతూ నిలిచి గెలిచింది. బీఆర్ఎస్ (నాటి టీఆర్ఎస్) పార్టీ పుట్టిన మూడు నాలుగేండ్లకే ఆ పార్టీ ఎమ్మెల్యేలను 2005లోనే కాంగ్రెస్ ప్రభుత్వం చీల్చింది. నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి, కేవీపీ ఇద్దరూ కలిసి టీఆర్ఎస్ను చీల్చుతున్నారంటూ నాటి ఎమ్మెల్యే కాసీపేట లింగయ్య (బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాకపోయినా) ప్రకటించి కాంగ్రెస్ కుయుక్తులను బయటపెట్టారు. జయప్రకాశ్రెడ్డి, బండారు శారారాణి, కంభంపాటి లక్ష్మారెడ్డి, సోయం బాపూరావు, నారాయణరావు పటేల్, మందాటి సత్యనారాయణరెడ్డి, దుగ్యాల శ్రీనివాసరావు సహా 10 మంది ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీ కొనుగోలు చేసిందని గ్రహించిన తెలంగాణ సమాజం వారిని ద్రోహులుగా ప్రకటించి ఊరూరా ఉద్యమాలు చేసింది. ఆ తరువాత 2009లో ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రెండోసారి అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో బీఆర్ఎస్ నుంచి గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే ప్రయత్నాలు సాగుతున్నాయని తెలిసి తెలంగాణ అగ్నిగుండమైంది. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించడం, కేసీఆరే పాలనా బాధ్యతలు స్వీకరించడం, వివిధ రంగాల్లో రాష్ర్టాన్ని అగ్రగామిగా నిలబెట్టడం ఎన్నటికీ మరుపురాని చరిత్ర.
21 ఏండ్ల క్రితం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కాకతాళీయమో, యాదృచ్ఛికంగానో నాగర్కర్నూల్లో ఉన్నారు. 2003 సెప్టెంబర్ 15న నాగర్కర్నూల్ నగారాతో నల్లమలకొండల్లో జై తెలంగాణ నినాదం మార్మోగింది. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కేసీఆర్ నేడు (శనివారం) కూడా నాగర్కర్నూల్లో రోడ్షోలో పాల్గొననున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ గెలుపు కోసం ప్రసంగించనున్నారు.