కోహెడ, సెప్టెంబర్ 27 : మండలంలోని తంగళ్లపల్లి గ్రామ శివారులోని మోయతుమ్మెద వాగు చెక్డ్యాం కింది ప్రాంతంలోని కయ్యలో ఆదివా రం గల్లంతైన మామ మ్యాదర రాజు, అల్లుడు చెంచల రితీశ్ మృతదేహాలు సోమవారం లభ్యమయ్యాయి. ఆదివారం సాయంత్రం సర్పంచ్ పాము నాగేశ్వరి, ఎంపీటీసీ కోనె శేఖర్ శనిగరం జాలర్లతో గాలించినా ఆచూకీ తెలియకపోవటంతో సోమవారం ఉదయం హుస్నాబాద్ అగ్నిమాపక దళం, రెస్క్యూ టీం సహాయంతో ఏసీపీ వాసాల సతీశ్, సీఐ రఘుపతిరెడ్డి, ఆర్డీవో జయచంద్రారెడ్డి ఆధ్వర్యంలో గాలింపు చర్యలు చేపట్టారు. ఉదయం 10 గంటల ప్రాంతంలో రితీశ్ మృతదేహం లభ్యం కాగా, మధ్యాహ్నం ఒంటి గంటకు రాజు మృతదేహం నీటిపై తేలాడుతూ కనిపించింది. మామ, అల్లుడి మృతదేహాలు లభ్యం కావటంతో వారి తల్లిదండ్రులు, బంధువుల రోదనలు బ్రిడ్జి ప్రాంతంలో మిన్నంటాయి. ఇద్దరి మృతదేహాలను పోలీసులు పోస్టుమార్టం కోసం ప్రభుత్వ దవాఖానకు తరలించారు. ఘటనాస్థలాన్ని ఎంపీపీ కొక్కుల కీర్తి, జడ్పీటీసీ నాగరాజుశ్యామల, తహసీల్దార్ రుక్మిణి, టీఆర్ఎస్ నాయకులు శ్రీహరి సందర్శించి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. ఘటనాస్థలానికి కోహెడ మండల ప్రజలు భారీగా తరలివచ్చారు. ఈ ఘటన ప్రజలను కంటతడి పెట్టించాయి.