బంట్వారం, జూన్ 14 : గ్రామాల్లో నెల కొన్న సమస్యలను సాధ్యమైనంత వరకు సత్వరమే పరిష్కరిస్తామని ఎమ్మెల్యే ఆనంద్ పేర్కొన్నారు. మంగళవారం బంట్వారం మండలలోని యాచారం, నూరుళ్లపూర్ గ్రామాల్లో పర్యటించి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం యాచారం గ్రామంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మండల సర్వేయర్ సక్రమంగా విధులు నిర్వహించడం లేదని గ్రామస్తులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు.
భూమి సర్వే చేసేందుకు ఆన్లైన్ దరఖాస్తు చేసుకొని ఏడాది గడుస్తున్నా భూమి సర్వే చేయడం లేదన్నారు. స్పందించిన ఎమ్మెల్యే మండల సర్వేయర్ సక్రమంగా విధులు నిర్వహించకుంటే వెంటనే మరో సర్వేయర్ను నియమించడం, లేదా మార్చాలని తహసీల్దార్ శ్రీనివాస్రెడ్డికి సూచించారు.
అదే విధంగా గ్రామంలో కొన్ని అసైన్డ్ భూములు అక్రమంగా పట్టాలు చేసుకున్నారని గ్రామస్తులు ఎమ్మెల్యేకు చెప్పారు. 2013 తరువాత ఎలాంటి అసైన్డ్ భూములు ఇవ్వలేదని, అలా ఏమైనా అక్రమంగా ఇచ్చినవి ఉంటే వెంటనే విచారించి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఇవే కాక గ్రామంలొ మురుగు నీరు ఎక్కడ చేరకుండా చూడాలన్నారు.
అవసరమున్న చోట కాలువలు నిర్మించాలన్నారు. విద్యుత్ సరఫరాకు సంబంధించిన సమస్యలు వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ బల్వంత్రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ రాంచంద్రారెడ్డి, ఎంపీడీవో బాలయ్య, డాక్టర్ వందన, ఏఈలు వెంకటరమణ, ఎంపీటీసీ ప్రశాంతి, అయా గ్రామాల ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.