వికారాబాద్, మార్చి 12: రాష్ట్రంలోని ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండేందుకు సీఎం కేసీఆర్ ప్రభుత్వం కృషి చేస్తున్నదని వికారాబాద్ ఎమ్మెల్యే ఆనంద్ అన్నారు. ఇందులో భాగంగా బడ్జెట్లో వైద్యరంగానికి అధిక నిధులను కేటాయించడం గర్వకారణమన్నారు. శనివారం ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ ఆరోగ్యలక్ష్మి పథకం ద్వారా గర్భంలో ఉన్న బిడ్డ కోసం తల్లికి పాలు, గుడ్డుతోపాటు ప్రభుత్వం పౌష్టికాహారాన్ని అందిస్తుందన్నారు. ఏఎన్సీ వైద్య పరీక్షలు, అమ్మఒడి పథకం ద్వారా వాహనాల్లో దవాఖానలకు తీసుకెళ్లడం, ప్రసవాల తర్వాత తల్ల్లీబిడ్డలను ఉచితంగా ఇంటికి చేర్చడం వంటివి జరుగుతున్నాయన్నారు. 12 చోట్ల క్యాన్సర్కు సంబంధించి పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కొవిడ్ కష్టకాలంలో సేవలందించిన ఆశ వర్కర్లు, ఏఎన్ఎంల సేవలను ఆయన అభినందించారు. డయాగ్నొస్టిక్ కేంద్రాలను ఏర్పాటు చేసి, అందులో 57 పరీక్షలను ఉచితంగా చేయడం ఎంతో గొప్ప విషయమని అన్నారు. వికారాబాద్ జిల్లాకు మెడికల్ కళాశాలను మంజూరు చేసినందుకు సీఎం కేసీఆర్కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. మెడికల్, హెల్త్, ఫ్యామిలీ వెల్ఫేర్పై మాట్లాడేందుకు అవకాశం కల్పించిన సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్రావుకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.