తాండూరు రూరల్, ఫిబ్రవరి 10: నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు ఎంతగానో దోహదపడతాయని వికారాబాద్ జిల్లా ఎస్పీ కోటిరెడ్డి అన్నారు. గురువారం ఆయన మండలంలోని అంతారం గ్రామంలో సర్పంచ్ రాములు ఆధ్వర్యంలో రూ.5 లక్షలతో గ్రామంలో 16 చోట్ల ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ప్రారంభించి మాట్లాడా రు. సీసీ కెమెరాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉండాలన్నారు. గ్రామంలో ఏడాదిగా ఎలాంటి గొడవలు లేకుండా, ఒక్క కేసు కూడా నమోదు కాకపోవడం సంతోషంగా ఉందన్నారు. సీసీ కెమెరాల ఏర్పాటుతో నేరాల సంఖ్య బాగా తగ్గుతూ వస్తున్నదని కోటిరెడ్డి అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోనూ నేరాల సంఖ్యను తగ్గించాలనే ఉద్దేశంతోనే ప్రస్తుతం అన్ని గ్రామాల్లోనూ సీసీ కెమెరాల ఏర్పాటుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు.
అనంతరం తాండూరు డీఎస్పీ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ప్రజల సహకారం ఉంటే ఏదైనా సాధ్యమవుతుందని అన్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ తో మానవ సంబంధాలు పెరుగుతాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో సీఐ రాజేందర్రెడ్డి, ఎంపీటీసీ శాంతయ్య, ఉపసర్పంచ్ జీవరత్నం, టీఆర్ఎస్ నాయకులు ప్రకాశ్, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.