పరిగి, జనవరి 26 : తెలంగాణ రాష్ట్ర సమితి జిల్లా అధ్యక్షుడిగా వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ను పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ నియమించారు. గణతంత్ర దినోత్సవం రోజున టీఆర్ఎస్ పార్టీ 33 జిల్లాల అధ్యక్షుల నియామకం చేపట్టారు. ఇందులోభాగంగా పార్టీ అధ్యక్షుడిగా ఆనంద్ నియమితులయ్యారు. మెతుకు ఆనంద్ చిన్నప్పటి నుంచే నాయకత్వ లక్షణాలు పుణికిపుచ్చుకున్నారు. ఆయన కెరవెల్లిలో 7వ తరగతి వరకు, ధారూరు జడ్పీహెచ్ఎస్లో 10వ తరగతి వరకు, వికారాబాద్ ఎస్ఏపీ కళాశాలలో ఇంటర్మీడియట్, గాంధీ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్, వరంగల్ కాకతీయ మెడికల్ కళాశాలలో ఎండీ, ఎంఎస్ చదువుకున్నారు. అనంతరం డాక్టర్ వృత్తిని కొనసాగిస్తూ 2013లో తెలంగాణ ఉద్యమంలో పాలుపంచుకున్నారు. డాక్టర్స్ జేఏసీ చైర్మన్గా ఉంటూ ఉద్యమంలో పాల్గొన్నారు. అదే సంవత్సరం ఆనంద్ టీఆర్ఎస్ పార్టీలో చేరారు. 2018లో టీఆర్ఎస్ టికెట్ దక్కడంతో వికారాబాద్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. డాక్టర్ మెతుకు ఆనంద్ ‘మీతో నేను’ కార్యక్రమం ద్వారా నియోజకవర్గంలోని అనేక గ్రామాల్లో పర్యటించి, అక్కడి సమస్యలు తెలుసుకొని పరిష్కరించడం ద్వారా ప్రజలకు మరింత చేరువయ్యారు. రోజూ అనేక కార్యక్రమాల్లో పాలుపంచుకోవడం ద్వారా నిత్యం ప్రజల్లో ఉంటున్న వికారాబాద్ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ను టీఆర్ఎస్ జిల్లా అధ్యక్ష పదవి వరించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తనను వికారాబాద్ జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా నియమించినందుకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, సీఎం కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు. అధిష్ఠానం ఆదేశాలతో పార్టీని జిల్లాలో తిరుగులేని శక్తిగా తయారు చేసేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు, పనులను ప్రజల్లోకి తీసుకువెళ్లడం ద్వారా పార్టీ మరింత పటిష్ఠంగా తయారయ్యేలా కృషి చేస్తానని ఆయన తెలిపారు.