వికారాబాద్, నవంబర్ 24 (నమస్తే తెలంగాణ) : రైతుల సంక్షేమానికి టీఆర్ఎస్ ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తున్నది. రైతులు అప్పుల ఊబిలో చిక్కుకోకుండా పంటలను సాగు చేసేందుకు ఐదేండ్లుగా రైతు బంధు పథకాన్ని అమలు చేస్తూ పెట్టుబడి సాయాన్ని అందిస్తున్నది. ఏడాదికి ఎకరానికి రూ.10వేల చొప్పున రెండు విడుతల్లో రైతు బంధు సాయాన్ని ప్రభుత్వం అందజేస్తున్నది. ఎలాంటి మధ్యవర్తులు లేకుండా పూర్తి పారదర్శకంగా ఉండేందుకు నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లోనే డబ్బులను జమ చేస్తూ రైతు పక్షపాతిగా సీఎం కేసీఆర్ నిలుస్తున్నారు. దీంతో జిల్లా రైతాంగం హర్షం వ్యక్తం చేస్తున్నది.
ఐదేండ్లు.. రూ.2210 కోట్ల సాయం..
రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న రైతు బంధు పథకంతో రైతులకు అప్పుల తిప్పలు తప్పాయి. ప్రతి ఏటా ప్రభుత్వం ఎకరాకు రూ.10వేల చొప్పున పెట్టుబడి సాయాన్ని అందిస్తుండడంతో బ్యాంకుల చుట్టూ రైతులు ప్రదక్షిణలు చేసే రోజులకు ప్రభుత్వం చెక్ పెట్టింది. రైతు బంధు పథకం కింద గత ఐదేండ్లలో ప్రభుత్వం రూ.2210 కోట్ల సాయాన్ని రైతులకు అందజేశారు.
త్వరలో యాసంగి రైతు బంధు సాయం
యాసంగి పంటల సాగు ప్రారంభమైన దృష్ట్యా రైతులకు పెట్టుబడి సాయాన్ని త్వరలో ప్రభుత్వం అందించనుంది. నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లోనే జమ చేయనున్నారు. ఈ సీజన్కు సంబంధించి 2.50 లక్షల మంది రైతులకు రూ.310 కోట్ల మేర జమ చేయనుంది. ఆయా భూముల సమస్యలు పరిష్కారం కావడంతో సంబంధిత అన్నదాతలు రైతు బంధు నిమిత్తం దరఖాస్తు చేసుకోవడంతో వానకాలం సీజన్తో పోలిస్తే యాసంగి సీజన్కు అర్హులైన రైతుల సంఖ్య పెరిగినట్లు జిల్లా వ్యవసాయాధికారులు వెల్లడించారు.
అప్పుల తిప్పలు తప్పాయి
సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న రైతు బంధుతో పంట లాగోడికి షావుకారుల వద్ద చేయి చాచే తిప్పలు తప్పింది. టేకులపల్లిలో నాకున్న 5 ఎకరాల పొలంలో 60 సంవత్సరాలుగా వ్యవసాయం చేస్తున్నాను. రైతు బంధు ఎరువులు, విత్తనాల కొనుగోలు, పొలం దున్నడానికి, కలుపుతీతకు ఆసరాగా నిలుస్తున్నది. చేతికి వచ్చిన పంటలు సొంతంగా అమ్ముకుంటూ ఆర్థికంగా అభివృద్ధి చెందుతూ కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉన్నాం.
– గొల్ల రామయ్య, టేకులపల్లి,మోమిన్పేట
సమాజంలో గొప్పగా బతుకుతున్న..
సీఎం కేసీఆర్ ఇస్తున్న రైతు బంధు పైసలతో వ్యవసాయం చేసుకుంటూ సమాజంలో గొప్పగా బతుకుతున్నా. మా ఆయన మృతితో భూమి సాగుకు డబ్బులు లేక అప్పులు తీసుకొని పంట అమ్మి అప్పుల మిత్తులు కట్టేందుకే సరిపోయేది. రైతు బంధుతో భూమి సాగు, విత్తనాలు, ఎరువులకు అప్పుల తిప్పలు తప్పాయి. పత్తి, కంది మెట్ట పంటలు సాగు చేసుకుంటూ కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటున్నాం. రైతు బంధుతో చాలా పేద కుటుంబాలు వ్యవసాయం చేసుకుంటూ గర్వంగా జీవనం సాగిస్తున్నారు. రైతు బంధు పైసలు ఇస్తున్నందుకు కేసీఆర్ గారికి ధన్యవాదాలు.
– అలంపల్లి లక్ష్మి, ఎన్కతల,మోమిన్పేట
రైతు బంధుతో వ్యవసాయం అభివృద్ధి
రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందాలనే సంకల్పంతో కేసీఆర్ ప్రవేశపెట్టిన రైతుబంధు పథకంతో రైతులకు అప్పుల బాధ దూరమైంది. యువకులు కూడా వ్యవసాయం చేసుకుంటూ ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్నారు. నాకు 2.15 ఎకరాల పొలం ఉంది. వ్యవసాయం చేసేందుకు డబ్బులుండేవి కావు. భూమి కౌలుకిచ్చి గతంలో చిన్నచిన్న పనులు చేసుకుంటూ జీవనం సాగించేవాడిని. ప్రస్తుతం రైతు బంధు సాయంతో వ్యవసాయం చేస్తూ కూరగాయ, తదితర పంటలు సాగు చేసుకుంటున్నా.
– సొంటి కిరణ్, ఎన్కతల,మోమిన్పేట
రైతు బంధుతో అత్మహత్యలు తగ్గాయి
రైతు బంధుతో రైతుల అత్మహత్యలు తగ్గాయి. పంట పెట్టుబడుల కోసం పడిగాపులు కాసే తిప్పలు తప్పాయి. పంటలు పెట్టే సమయానికి రైతుల ఖాతాల్లో డబ్బులు జమవుతుండటం వల్ల విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసి విత్తనాలు వేసి పండిన పంటలను అమ్ముకుని అర్థికంగా లబ్ధి పొందుతున్నాం. నేను 25 ఏండ్ల నుంచి వ్యవసాయం చేస్తున్నాను. 5 ఎకరాల పొలం ఉంది. పత్తి, మొక్కజొన్న వేశాను.
– వాడెకాపు జైపాల్రెడ్డి, రైతు, మర్పల్లి
పంట పెట్టుబడికి ప్రభుత్వమే పైసలివ్వడం చరిత్రలోనే తొలిసారి
రైతుల పెట్టుబడికి ప్రభుత్వం పైసలివ్వడం చరిత్రలోనే తొలిసారి. నాకు 5 ఎకరాల పొలం ఉంది. గత 50 ఏండ్ల నుంచి వ్యవసాయం చేస్తున్నాను. ఏ ప్రభుత్వం కూడా రైతుల పెట్టుబడికి పైసలు ఇవ్వలేదు. టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాకముందు బయట అప్పు తీసుకుంటూ అధిక వడ్డీలు కట్టేవాళ్లం. రైతుల బాధలు తెలుసుకున్న సీఎం కేసీఆర్ రైతు బంధు ప్రవేశపెట్టి విత్తనాలు వేసే సమయానికి పైసలు ఖాతాల్లో జమ చేయడం చాలా సంతోషంగా ఉంది. సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు.
– సిద్ధిరామప్ప, రైతు, మర్పల్లి
కేసీఆర్ సారు సల్లంగుండాలె..
పంట సాగు చేసే సమయానికి సీఎం కేసీఆర్ రైతు బంధు సాయం చేస్తుండు. దీంతో ఎవరి వద్దకు వెళ్లకుండానే గౌరవంగా ఎవుసం చేసుకుంటున్నాం. నాకు 3.5 ఎకరాల పొలం ఉంది. ఎటువంటి బాధ లేకుండా వ్యవసాయం చేసుకొని పంట పండించడం, పండించిన పంటలను ప్రభుత్వమే కొనుగోలు చేయడంతో బాధ లేకుండా పోయింది. కేసీఆర్ సారు సల్లంగుండాలె.
– తులసీరాం, దేవులానాయక్తండా, బొంరాస్పేట