పరిగి, ఫిబ్రవరి 9 : సీఆర్ఐఎఫ్ కింద చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని మూడు రోడ్ల వెడల్పు, అభివృద్ధికి రూ.32కోట్లు మంజూరైనట్లు ఎంపీ రంజిత్రెడ్డి తెలిపారు. వికారాబాద్ జిల్లాలోని తాండూరు, వికారాబాద్, కొడంగల్ నియోజకవర్గాల పరిధిలోని రోడ్లను అభివృద్ధి చేయనున్నట్లు ఆయన చెప్పారు. తాండూరు నుంచి ధారూర్ రోడ్డు(9వ కిలోమీటరు నుంచి 18వ కిలోమీటరు వరకు) 9 కిలోమీటర్లు, కొడంగల్ నియోజకవర్గంలోని బొంరాస్పేట్ మండలం తుంకిమెట్ల నుంచి నారాయణపేట్ రోడ్డు(0 నుంచి 2 కిలోమీటర్ల వరకు) మొత్తం 11 కిలోమీటర్లు రోడ్డు విస్తరించి అభివృద్ధి చేసేందుకు రూ.17కోట్లు మంజూరైనట్లు పేర్కొన్నారు. మహేశ్వరం నియోజకవర్గంలోని శంషాబాద్ నుంచి కొల్లపడకల రోడ్డు (7వ కిలోమీటరు నుంచి 22వ కిలోమీటరు వరకు) 14 కిలోమీటర్లు విస్తరించి అభివృద్ధి చేసేందుకు రూ.15కోట్లు మంజూరయ్యాయన్నారు. ఈ మేరకు చేవెళ్ల పార్లమెంటు పరిధిలో 25.6 కిలోమీటర్లు రోడ్డు విస్తరణ, అభివృద్ధి కోసం రూ.32కోట్లు మంజూరైనట్లు తెలిపారు. ఈ నిధులతో గ్రామీణ రోడ్లకు మహర్దశ రానుందని ఎంపీ పేర్కొన్నారు.