వికారాబాద్, డిసెంబర్ 19 (నమస్తే తెలంగాణ) : ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు 399 గ్రామపంచాయతీ భవనాలు మంజూరయ్యాయని మంత్రి సబితారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. గ్రామపంచాయతీ భవనాలను మంజూరు చేసినందుకు ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులు, ప్రజల తరఫున సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు. వికారాబాద్ జిల్లాకు 276, రంగారెడ్డి జిల్లాకు 123 పంచాయతీ భవనాలను ప్రభుత్వం మంజూరు చేసిందని.. ఒక్కో భవనానికి రూ.20 లక్షల చొప్పున నిధులు విడుదలయ్యాయని చెప్పారు. కొత్తగా ఏర్పాటైన గ్రామపంచాయతీల్లో భవనాలు లేకపోవడంతో చాలా మంది సర్పంచ్లు, ప్రజలు తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తేవడంతో సీఎం కేసీఆర్ స్పందించి గ్రామ పంచాయతీ భవనాలు మంజూరు చేశారని పేర్కొన్నారు. ప్రజలకు పాలన మరింత చేరువ చేయాలన్న లక్ష్యంతో ఏర్పాటు చేసిన నూతన గ్రామ పంచాయతీలకు కొత్త భవనాలు మంజూరుతో పాలకవర్గాలతో పాటు ప్రజలకు కూడా ఎంతో సౌకర్యంగా ఉంటుందని మంత్రి అన్నారు. పెద్దఎత్తున పంచాయతీ భవనాలు మంజూరు చేసినందుకు పంచాయతీరాజ్ శాఖ మంత్రి దయాకర్రావుకు మంత్రి సబితారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.
ఎంపీ రంజిత్రెడ్డికి జిల్లా ప్రజలు కృతజ్ఞతలు
వికారాబాద్ జిల్లాలో 276 గ్రామపంచాయతీల నూతన కార్యాలయ భవనాలకు నిధులు మంజూరయ్యాయని చేవెళ్ల ఎంపీ రంజిత్రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఒక్కో భవనానికి రూ.20లక్షల చొప్పున రూ.55.20కోట్లు మంజూరయ్యాయన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 3,686 పంచాయతీలకు నూతన భవనాలు మంజూరు కాగా.. వాటిలో వికారాబాద్ జిల్లాకే అత్యధిక పంచాయతీల భవనాలకు నిధులు మంజూరయ్యాయని తెలిపారు. నూతనంగా ఏర్పడిన పంచాయతీలు అద్దె భవనాల్లో, అసౌకర్యాల నడుమ పాలకవర్గాలు కాలం వెళ్లదీస్తుండగా సర్పంచ్లు తమ దృష్టికి తీసుకొచ్చారన్నారు. ఈ మేరకు పంచాయతీ భవనాల సమస్యను సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు దృష్టికి తీసుకెళ్లామన్నారు. త్వరలో పంచాయతీ కార్యాలయ సమస్యలు తీరనున్నాయని ఎంపీ తెలిపారు. ఈ మేరకు జిల్లాలోని ఆయా పంచాయతీల పాలకవర్గాలు, ప్రజలు ఎంపీ రంజిత్రెడ్డికి, ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు.