వికారాబాద్: తిమ్మాపూర్ వాగులో కారు కొట్టుకుపోయిన ఘటనలో ఇద్దరు క్షేమంగా బడటపడ్డారు. మిగిలినవారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఆదివారం కురిసిన భారీవర్షాలకు జిల్లాలోని మర్పల్లి మండలం తిమ్మాపూర్ వాగులో ప్రమాదవశాత్తు కారు కొట్టుకుపోయిన విషయం తెలిసిందే. మోమిన్పేట నుంచి రావులపల్లి వెళ్తుండగా ప్రవాహంలో కారు కొట్టుకుపోగా.. ఐదుగురు గల్లంతయ్యారు. దీంతో గాలింపు చేపట్టిన పోలీసులు.. గల్లంతైన కారును గుర్తించారు. అందులో ఇద్దరు క్షేమంగా ఉన్నారని పోలీసులు తెలిపారు. వరుడు నవాజ్రెడ్డి, ఆయన సోదరి శ్వేత క్షేమంగా ప్రాణాలతో బయటడ్డారు. గల్లంతైన వధువు ప్రవల్లిక, వరుడి అక్క రాధమ్మ, డ్రైవర్ రాఘవేందర్ రెడ్డి, బాలుడు ఇషాంత్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.
ఈ నెల 26న రావులపల్లికి చెందిన నవాజ్రెడ్డికి, మోమిన్పేటకు చెందిన ప్రవల్లికతో వివాహం జరిగింది. ఆదివారం రాత్రి మోమిన్పేటకు వెళ్లి వస్తుండగా తిమ్మాపూర్ వాగులో కారు కొట్టుకుపోయింది. రోడ్డుపై నుంచి నీరు పారుతుండగా.. వద్దని వారించినా వినకుండా వాగుదాటుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుందని స్థానికులు పేర్కొన్నారు.
కాగా, భారీ వర్షాలతో వాగులో కారు కొట్టుకుపోయిన ఘటనపై మంత్రి సబితారెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వికారాబాద్ జిల్లా కలెక్టర్, ఎస్పీతో ఫోన్లో మాట్లాడారు. గల్లంతైన కారుకోసం గాలింపు చర్యలపై ఆరా తీశారు. వాగులవద్ద బందోబస్తు ఏర్పాటుచేయాలని ఎస్పీని ఆదేశించారు.