వికారాబాద్, జూన్ 3 : పల్లె ప్రగతితో గ్రామాలు, పట్టణ ప్రగతితో పట్టణాలు పరిశుభ్రంగా మారుతాయని టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, వికారాబాద్ ఎమ్మెల్యే ఆనంద్ తెలిపారు. శుక్రవారం 5వ విడత పల్లె ప్రగతిలో భాగంగా మండల పరిధిలోని పులుమద్ది గ్రామంలో ఏర్పాటు చేసిన గ్రామ సభలో జిల్లా కలెక్టర్ నిఖిలతో కలిసి పాల్గొన్నారు.
అనంతరం 4వ విడత పట్టణ ప్రగతి కార్యక్రమాల్లో భాగంగా 18వ వార్డు రామయ్యగూడలో కలెక్టర్, మున్సిపల్ చైర్పర్సన్లతో కలిసి పాల్గొన్నారు. ప్రజల వద్ద నుంచి పలు సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆనంద్ మాట్లాడుతూ.. వికారాబాద్ నియోజకవర్గంలో మీతో నేను కార్యక్రమాన్ని మొదటి సారిగా పులుమద్ది గ్రామం నుంచి ప్రారంభించామన్నారు.
గ్రామ సర్పంచ్ కోరిక మేరకు సీసీ రోడ్లకు రూ.5లక్షల నిధులు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. మిషన్ భగీరథ నీటిని తాగడానికి వినియోగించాలని, వాటర్ ట్యాంకులను నెలకు మూడు సార్లు పరిశుభ్రం చేయాలని సూచించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ నిఖిల మాట్లాడుతూ.. ఇదివరకు నిర్వహించిన పల్లె ప్రగతి కార్యక్రమంలో రూ.94లక్షలతో అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. ఈ సారి 15 రోజుల పాటు నిర్వహించే పల్లె ప్రగతి, పట్టణ ప్రగతిలో గ్రామాలు, వార్డులను అభివృద్ధి చేయనున్నట్లు పేర్కొన్నారు. ప్రతి రోజు తడి, పొడి చెత్తను వేరు చేసి పారిశుద్ధ్య కార్మికులకు అందించాలని సూచించారు.
కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ మంజూల, పీఏసీఎస్ చైర్మన్ ముత్యంరెడ్డి, పట్టణ అధ్యక్షులు ప్రభాకర్రెడ్డి, కౌన్సిలర్ కృష్ణ, మున్సిపల్ కమిషనర్ శరత్చంద్ర, సర్పంచ్ మాధవరెడ్డి, ఎంపీపీ చంద్రకళ, ఎంపీడీవో సత్తయ్య, నాయకులు తదితరులు పాల్గొన్నారు.