వికారాబాద్, ఆగస్టు 31 : నిర్విరామంగా ప్రజా శ్రేయస్సుకై కృషి చేస్తున్న బీఆర్ఎస్ వైపే ప్రజలందరూ మొగ్గు చూపుతున్నారని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. గురువారం వికారాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వికారాబాద్ మండలం పిలారం గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ వార్డు సభ్యులు, సీనియర్ నాయకులు 60 మంది బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి ఎమ్మెల్యే ఆనంద్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. దేశంలో ఏ రాష్ట్రంలో జరగనంత అభివృద్ధి మన రాష్ట్రంలో జరుగతుందని గుర్తు చేశారు.
రైతులకు రైతు బంధు, రైతు బీమా, 24 గంటల ఉచిత కరెంట్, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, ఆసరా పింఛన్లు, లక్ష రూపాయల ఆర్థిక సహాయం, మిషన్ భగీరథ, దళిత బంధు తదితర పథకాలు అమలు చేసి ప్రజల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నారని కొనియాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని వర్గాల ప్రజలకు సమాన న్యాయం చేస్తూ దేశానికే ఆదర్శంగా నిలిచారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు కమాల్రెడ్డి, నాయకులు నర్సింహులు, సంజీవ్ తదితరులు పాల్గొన్నారు.