‘చిరిగిన చొక్కా అయినా తొడుక్కో.. కానీ ఓ మంచి పుస్తకం కొనుక్కో’ అన్నాడో మహానుభావుడు. ఒక్క పుస్తకం తోడుంటే.. అనంత జ్ఞానం మన సొంతం. అంతటి విజ్ఞానాన్ని అందించే అక్షరాల చెట్టు నీడలో సేద తీరే సమయం రానే వచ్చింది. ఏటా నగర వాసి ముంగిట కొలువుదీరే పుస్తకాల పండుగ తెలంగాణ కళాభారతి (ఎన్టీఆర్ స్టేడియం)లో గురువారం నుంచి మొదలైంది. ఈ 35వ హైదరాబాద్ బుక్ ఫెయిర్ను మంత్రి శ్రీనివాస్గౌడ్ ప్రారంభించారు. “జీవితాన్ని తీర్చిదిద్దేది పుస్తకమే.. సమాజ మార్పులోనూ ముఖ్యపాత్ర పోషిస్తుంది.. శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం ఎంత పెరిగినా.. పుస్తక పఠనంతో వచ్చే జ్ఞానం శాశ్వతం” అని అన్నారు. తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్ అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది. తొలిరోజు బుక్ ఫెయిర్కు నలుమూలల నుంచి తరలివచ్చిన సందర్శకులు.. వివిధ రకాల పుస్తకాలను ఆసక్తిగా పరిశీలించారు. నచ్చిన వాటిని కొనుగోలు చేశారు
సిటీబ్యూరో, డిసెంబర్ 22 (నమస్తే తెలంగాణ) / కవాడిగూడ: జ్ఞాన సంపదను జాతికి అందించాలనే తెలంగాణ ప్రభుత్వం ప్రతియేటా నగరంలో పుస్తక వేడుక నిర్వహణకు ప్రోత్సహిస్తున్నదని ఎక్సైజ్, పర్యాటక, సాంసృతిక శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. తెలంగాణ కళాభారతి (ఎన్టీఆర్ స్టేడియం) మిద్దె రాములు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన 35వ హైదరాబాద్ జాతీయ పుస్తక వేడుకను గురువారం మధ్యాహ్నం మంత్రి శ్రీనివాస్గౌడ్ ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. అనంతరం తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్, హైదరాబాద్ పుస్తక ప్రదర్శన అధ్యక్షుడు జూలూరు గౌరీశంకర్ అధ్యక్షతన అలిశెట్టి ప్రభాకర్ వేదికలో జరిగిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ.. సాంకేతిక పరిజ్ఞానాన్ని మంచికి ఉపయోగించుకుంటే విద్యార్థులు అనుకున్న లక్ష్యాలను సాధిస్తారని అన్నారు. పుస్తక పఠనం ద్వారానే జ్ఞానయోధులుగా నిలుస్తారని ఆయన సూచించారు. పుస్తక ప్రదర్శన ప్రారంభోత్సవం సందర్భంగా అతిథులకు విద్యార్థులు ఘనంగా స్వాగతం పలికారు. కార్యక్రమంలో భాషా, సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ, పుస్తక ప్రదర్శన ఉపాధ్యక్షుడు కోయ చంద్రమోహన్, కార్యదర్శి శృతికాంత్ భారతి, కోశాధికారి పి. రాజేశ్వర్రావు తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉంటే తెలం గాణ సాయుధ పోరాట యోధుడు జైని మల్లయ్యగుప్తా అస్తమించడంతో సభాప్రాంగణంలో రెండు నిమిషాలు మౌనం పాటించి నివాళులర్పించారు.
అలిశెట్టి ప్రభాకర్ వేదిక మధ్యాహ్నం
2 గంటలకు – విద్యార్థుల విచిత్ర
సాయంత్రం 4.15గంటలకు – తొడిమలేని మొగ్గ పుస్తకావిషరణ.
సాయంత్రం 5.45గంటలకు – కొండపల్లి నిహారిణి పుస్తకావిషరణ.
వ్యవసాయం, అనుబంధ రంగాల సమగ్ర సమాచారం కోసం స్వేద వేదం నుంచి ఔషధ వేదం వరకు అన్ని లభిస్తాయి. మిద్దెతోట మొదలు పొదరిల్లు దాకా సిరిధాన్యాలతోపాటు పాకసిరి కోళ్లు, చేపలు, మేకలు, ఆవులు, గేదెలు శాస్త్రీయ పోషణ వరకు.. ఎన్నో అంశాల్లో పుస్తకాలు లభిస్తాయి.
పికాక్ క్లాసిక్స్ స్టాల్ నంబర్-193లో పిల్లల పుస్తకాల నుంచి ఫిలాసఫీ వరకు, పంచతంత్రం నుంచి ప్లేటో రచనల దాకా, బాలల పుస్తకాలు, సైన్స్, జీవిత కథలు, భారతీయ కథా సాహిత్యం, ప్రపంచ కథా సాహిత్యం, బౌద్ధ సాహిత్యం, భారతీయ, పశ్చిమ తత్వశాస్త్ర గ్రంథాలు లభిస్తాయి. ఇక్కడ ఏ పుస్తకం కొన్నా రూ.50లకే లభిస్తుంది.
స్టాల్ నెంబర్ 106 అక్షరయాన్ వెయ్యికి పైగా మహిళా రచయితల సంస్థ ఏర్పాటు చేసిన అక్షరయాన్ టీడబ్ల్యూడబ్ల్యూఎఫ్ స్టాల్ను ఉమెన్ సేఫ్టీ వింగ్ డీఐజీ సుమతి ప్రారంభించారు.
తెలంగాణ డిజిటల్ రిపాజిటరీ స్టాల్ను ఐటీ సెక్రటరీ జయేశ్ రంజన్ సందర్శించారు.
పుస్తకాలు చదవకపోతే చరిత్రను మర్చిపోతాం పుస్తక పఠనం లేకపోతే చరిత్రను మర్చిపోయే ప్రమాదం ఉంది. గతంలో వచ్చిన ఓ సర్వేను పరిశీలిస్తే 74శాతం అమెరికన్లు తమకు స్వాతంత్య్రం ఎప్పుడొచ్చిందని ప్రశ్నవేస్తే చెప్పలేకపోయారు. దీనికి కారణం పుస్తకాన్ని మర్చిపోవడమే. 75వ భారత స్వాతంత్య్ర వేడుకల సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ప్రదర్శించిన గాంధీ చిత్రాన్ని 80 లక్షల మంది విద్యార్థులు వీక్షించారు. దీని ద్వారా వారు చాలా విషయాలు తెలుసుకున్నామని చెప్పారు. అందుకే పుస్తకం చదవడం ఒక అభిరుచిగా మార్చుకోవాలి.
– అల్లం నారాయణ, మీడియా అకాడమీ చైర్మన్
ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టిన రోజును పుస్తక పఠన దినంగా పాటించాలి. సీఎం కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని విద్యార్థులు ఒకరికొకరు బహుమానంగా పుస్తకాలనే ఇచ్చిపుచ్చుకోవాలి. అప్పుడే నేటి విద్యార్థులు రేపటి భారత జ్ఞానయోధులుగా నిలువగలుగుతారు. పుస్తకాలను విరివిగా చదివి, రాయాలి.
– జూలూరు గౌరీశంకర్, హైదరాబాద్
బుక్ ఫెయిర్ అధ్యక్షుడు, సాహిత్య అకాడమీ చైర్మన్
పుస్తకం అంటే తరువాతి తరాలకు జ్ఞానాన్ని మోసుకెళ్లేది. పుస్తకాలు చదవడం వల్ల 20 శాతం నుంచి 50 శాతం మేరకు జ్ఞాపకశక్తి పెరుగుతుంది. దీంతోపాటు ఏకాగ్రత పెరుగుతుంది. తల్లిదండ్రులు పుస్తకాలను చదువుతూ.. పిల్లలను చదివించాలి. ఇది ఉద్యమంగా జరగాలి. ప్రతి విద్యార్థి ఒక సంవత్సరంలో పది పుస్తకాలు చదివి మరొకరి చేత చదివించాలి.
– కే.శ్రీనివాస్, ఆంధ్రజ్యోతి సంపాదకుడు
పుస్తకాల్లోనే జ్ఞానం ఉంది. పాండిత్యాన్ని సాధిస్తే.. ప్రపంచంలో ఎక్కడైనా అవకాశాలు మెండుగా ఉంటాయి. జ్ఞానంతోనే చరిత్రలో నిలిచి గెలిచేందుకు అవకాశం ఉంటుంది. పుస్తక ప్రదర్శన అనడం కంటే.. పుస్తకాల జాతర, పండుగ, వేడుక అని పిలువాలె.
– తిగుళ్ల కృష్ణమూర్తి, నమస్తే తెలంగాణ ఎడిటర్
పుస్తకం చదవడం వల్ల ప్రశ్నించే తత్వం పెరుగుతుంది. చదవడం వల్లనే విప్లవాలు వస్తాయి. చైతన్యమే ఒక విప్లవం.
– సుధా భాసర్, నవతెలంగాణ
హైదరాబాద్ పుస్తక ప్రదర్శనకు తెలంగాణ ప్రభుత్వం అనేక విధాలుగా ప్రోత్సహించడం సంతోషకరం. ఎన్ని భాషలు ప్రభావం చూపినా మాతృభాషను వదులుకోకుండా ఉండలేము.
– కే.శ్రీనివాస్రెడ్డి, ప్రజాపక్షం ఎడిటర్
పుస్తక ప్రదర్శన అంటే జ్ఞానాన్ని పంచే పండుగలా ఉంది. మా విద్యార్థినులను తీసుకొని ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉంది. మా కళాశాల విద్యార్థులు చాలా పుస్తకాలు చదివేందుకు ఇష్టపడతారు. అందుకు కారణం మా దగ్గర ల్రైబరీలో చాలా పుస్తకాలు ఉన్నాయి. కథలు, నవలలు లాంటి వాటిని అందుబాటులో ఉంచాం. పుస్తక ప్రదర్శనకు రావడంతో విద్యార్థులు ప్రతిస్టాల్ను సందర్శించారు. పుస్తకాలను తరచిచూసి కొనుకున్నారు. చాలా సంతోషంగా ఉంది.
– వసుంధర, కళాశాల ప్రిన్సిపాల్
పుస్తక ప్రదర్శన అద్భుతంగా ఉంది. నేను ఇలాంటి చోటుకు రావడం ఇదే మొదటిసారి. ఇంతుకుమునుపే రాబర్ట్ టి. కియోసాకి రచించిన రిచ్ డాడ్-పూర్ డాడ్ ప్తుకాన్ని చదివాను. ఆ పుస్తకం నాకు చాలా నచ్చింది. ఇటువంటి పుస్తక ప్రదర్శనకు వస్తే ఎన్నో అద్భుతమైన పుస్తకాలు, కథలు, నవలలకు సంబంధించిన అంశాల్లో ఉంటాయని మా టీచర్లు చెప్పారు. అందుకే వచ్చాం.
– తేజశ్రీ, ద్వితీయ సంవత్సరం,సరూర్నగర్ ఎంజేపీ కళాశాల
‘ది పవర్ ఆఫ్ సబ్కాన్షియస్ మైండ్’ అనే పుస్తకాన్ని చదివాను. మా సరూర్నగర్ క్యాంపస్లోని లైబ్రరీలో చాలా పుస్తకాలు ఉంటాయి. మా ప్రిన్సిపాల్ వసుంధర, లైబ్రేరియన్ వరలక్ష్మిప్రోత్సాహంతో పుస్తకాలు చదవడం, వాటిపై సమీక్షలు రాయడం నేర్చుకున్నాం. ఆయా పుస్తకాలు
చదవడం వల్ల మాకు ఆలోచనా శక్తిని పెంపొందించుకున్నాం. హైదరాబాద్ పుస్తక ప్రదర్శనకు రావడం ఒక
పండుగలా ఉంది.
– లావణ్య, ద్వితీయ సంవత్సరం, సరూర్నగర్ ఎంజేపీ కళాశాల
మంత్రి కేటీఆర్ లాంటి డైనమిక్ లీడర్ స్ఫూర్తితో రాజకీయాల్లోకి రావాలని ఉందని యువ రచయిత్రి తన అభిప్రాయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. గురువారం 35వ పుస్తక ప్రదర్శనకు వచ్చిన 10వ తరగతి చదువుతున్న యువ రచయిత్రి వైష్ణవి తాను రాసిన ‘ది జాజ్ గ్యాంగ్ – ఏ డేంజరెస్ ఎస్కేప్’ పుస్తకాలను మంత్రి కేటీఆర్కు ఇవ్వాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నట్లు ట్విట్టర్లో పేర్కొన్నది. అంతేకాదు భవిష్యత్లో తాను రాజకీయాల్లోకి రావాలని అనుకుంటున్నట్లు ఆమె వెల్లడించింది. కాగా వెంటనే ట్విట్టర్ వేదికగా మంత్రి కేటీఆర్ స్పందిస్తూ వైష్ణవి ఆలోచనను అభినందించారు. యువ రచయిత్రి వైష్ణవిని త్వరలోనే తన బృందం కలుస్తుందని ఆయన ట్వీట్ చేశారు.
విద్యార్థులను పరిపూర్ణమైన జ్ఞానం సాధించేందుకు పుస్తకాలు దోహదపడుతాయి. అందువల్ల తమ కళాశాల గ్రంథాలయంలో సబ్జెక్టు పుస్తకాలే కాకుండా ఇతర పుస్తకాలు చదవడం వల్ల విద్యార్థులకు స్వతంత్రంగా ఆలోచించే శక్తి పెంపొందుతుందనే ఉద్దేశంతో ప్రిన్సిపాల్ ఆధ్వర్యంలో చదివిస్తున్నాం. చదివిన పుస్తకాలపై సమీక్షలు కూడా రాస్తున్నారు.
– వరలక్ష్మి, లైబ్రేరియన్, సరూర్నగర్