మహబూబ్నగర్, ఆగస్టు 19 : ఉమ్మడి పాలమూరు జిల్లాలోని చాలా ప్రభుత్వ శాఖల్లో అవినీతి జలగల్లా ప్రభుత్వ ఉద్యోగులు మారారు. డబ్బులు ఇవ్వనిదే పనిచేయటం లేదు. నెలల తరబడి బాధితులను కార్యాలయాల చూట్టూ తిప్పుకంటారు. అవినీతి నిరోధకశాఖ అధికారులకు ఎంతో మంది పట్టుబడినా ఏ మాత్రం జంకటం లేదు. వారి బుద్ధి మారటం లేదు. రోజూ జేబులు నింపుకొనే ఇంటికి వెళ్తున్నారు. ఆర్థిక స్థోమత లేక , ఏం చేయా లో తేలియక అమాయకులు, పేదలు కుమిలిపోతున్నారు. గతంలో ఏన్నడూ లేని విధంగా గత 19 నెలల్లో 20మంది అధికారులు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఇంకా దొరకని దోరలు వందల్లో ఉంటారు.
ప్రతి జిల్లాలో ప్రభుత్వ శాఖలు 70 వరకు ఉంటాయి. అందులోని చాలా శాఖల అధికారులు లంచాలే లక్ష్యంగా పనిచేస్తున్నారు. తమ వద్దకు వచ్చే ప్రజలకు పనులు చేయకుండా జలగల్లా వేధిస్తూన్నారు. రకరకాల బాధలతో సతసతమవుతూ పరిష్కారిస్తారని వస్తే అధికారులు మరింత పెద్ద సమస్య అవుతున్నారు. ఈ పరిస్థితితో అమాయకులు , నిరుపేదలకు దిక్కు తోచటం లేదు. నిరక్షరాస్యులు, పనులు కావడమే ముఖ్యమని భావించే విద్యావంతులు కూడా అధికారులకు లంచాలు ఇస్తున్నారు. కొందరు చైతన్యవంతులు మాత్రమే ఏసీబీను ఆశ్రయించి అవినీతి జలగలను పట్టిస్తున్నారు. ఇతర శాఖలతో పోలీస్తే రెవెన్యూ, స్టాంపులు , రిజిస్ట్రేషన్లు, పోలీస్, రవాణా, ఎక్సైజ్, మున్సిపాలిటీ, పంచాయతీ రాజ్, పౌరసరఫరాలు, ఆర్అండ్బీ తదితర శాఖల్లో అవినీతి మరింత ఎక్కువగా ఉంది.
ప్రభుత్వ శాఖల్లో అధికారులు సిబ్బంది లంచం డిమాండ్ చేస్తే నేరుగా మహబూబ్నగర్ పట్టణంలోని ఎర్రసత్యం చౌరస్తాలోని ఏసీబీ కార్యాలయంలో ఫిర్యా దు చేయండి . మా సిబ్బంది ఎప్పుడు అందుబాటులో ఉంటారు. లేదా టోల్ ఫ్రీ నెంబర్కు ఫిర్యాదు చేయాలి. వివరాలు గోప్యంగా ఉంచుతాం. వారి పనులు కూడా పూర్తి చేయిస్తాం. ఫిర్యాదుకు ప్రజలు ముందుకొస్తేనే అవినీతి లంచం తీసుకోవడం ఆగిపోతుంది. – సీహెచ్ బాలకృష్ణ,
ఏసీబీ రేంజ్ డీఎస్పీ, ఉమ్మడి మహబూబ్నగర్