పరిగి, మార్చి 24 : వ్యవసాయంలో ఆదాయాన్ని రెట్టింపు చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ఎఫ్పీజీలను ఏర్పాటు చేసి ప్రోత్సహిస్తున్నది. సమష్టిగా వ్యవసాయం చేయడం, తమ ఆలోచనలను ఒకరికొకరు పంచుకోవడం, అందరూ కలిసి విత్తనాలు, ఎరువులు కొనడం, సహజసిద్ధంగా వ్యవసాయంతో పెట్టుబడులు తగ్గడంతోపాటు రోజురోజుకూ ఆర్థికంగా ఎదిగేందుకు తోడ్పాటు లభిస్తుంది. ప్రభుత్వం వికారాబాద్ జిల్లావ్యాప్తంగా ప్రత్యేకంగా రైతు ఉత్పత్తి గ్రూపులను ఏర్పాటుచేసి వారికి వ్యవసాయాధారిత యంత్ర పరికరాల కోసం నిధులు కూడా ఖర్చు చేశారు. వికారాబాద్ జిల్లావ్యాప్తంగా 18 మండలాల పరిధిలో 441 ఎఫ్పీజీలు ఏర్పాటు చేయగా 6788 మంది మహిళా రైతులు సభ్యులుగా ఉన్నారు. గత మూడు నాలుగు సంవత్సరాల నుంచి ఎఫ్పీజీల ఏర్పాటు ప్రక్రియ కొనసాగుతున్నది. ప్రతి ఎఫ్పీజీలో 15 నుంచి 20 మంది వరకు మహిళా రైతులు ఉన్నారు. జిల్లాలోని 323 ఎఫ్పీజీలకు సంబంధించి 5146 మంది మహిళా రైతులు వాటాధనంగా రూ.25,73,000., సభ్యత్వ రుసుముగా రూ.5,14,600 ఆయా సంఘాల్లో జమ చేశారు. ప్రతి నెలకు ఒకసారి వారందరూ సమావేశమై వ్యవసాయంపై చర్చించుకుంటారు. తాము సాగు చేసిన పంటలు, వాటిలో యాజమాన్య పద్ధతులు, ఇతర అంశాలపై చర్చించి సమష్టి నిర్ణయాలతో పంటల సాగు చేపడుతున్నారు.
ఎఫ్పీజీలు ఏర్పాటు చేసిన తర్వాత ప్రతి నెల జరిగే సమావేశాల్లో పంటల సాగుకు సంబంధించిన అంశాలపై విస్తృతంగా చర్చించి నిర్ణయాలు తీసుకొని అమలు చేయనున్నారు. ఎఫ్పీజీలలోని మహిళా రైతులు కలిసి విత్తనాలు, ఎరువులు, క్రిమిసంహారక మందులు కొనుగోలు చేయడం ద్వారా ధర కొంతవరకు తగ్గుతుంది. ఎఫ్పీజీలోని మహిళా రైతులకు ఎంత మొత్తంలో విత్తనాలు, ఎరువులు అవసరమనేది నిర్ణయించి మండల స్థాయిలో గల ఎఫ్పీవోలకు ఇండెంట్ ఇస్తారు. వారు సంబంధిత విత్తనాలు, ఎరువులను అందజేస్తారు. తద్వారా బయటి మార్కెట్ కంటే తక్కువ ధరకే ఎఫ్పీజీ సభ్యులకు విత్తనాలు, ఎరువులు లభిస్తాయి. అలాగే సహజ సిద్దమైన వ్యవసాయం చేయడం, రసాయనిక ఎరువుల వాడకం తగ్గించడం, అవసరం మేరకు వాటిని వాడుతుండడం ద్వారా కూడా పెట్టుబడి ఖర్చు తగ్గిపోతుంది. రానురాను సేంద్రియ వ్యవసాయం దిశగా అడుగులు పడుతున్నాయి. ప్రభుత్వం కల్పిస్తున్న సబ్సిడీ, వనరులను సద్వినియోగం చేసుకొని వారు పలు పంటలను పండిస్తున్నారు. సమష్టిగా వ్యవసాయం చేస్తుండడం ద్వారా 15-20 శాతం వరకు పెట్టుబడి ఖర్చులు తగ్గుతాయని అధికారులు పేర్కొంటున్నారు.
ఎఫ్పీజీల ద్వారా మహిళా రైతులు సమష్టిగా వ్యవసాయం చేస్తున్నారు. ప్రతి నెల సమావేశాలు నిర్వహించి పంటల సాగులో అవసరమైన సూచనలు, సలహాలు ఒకరికొకరు తెలియజేసుకుంటారు. ఒకేసారి కలిసి విత్తనాలు, ఎరువుల కొనుగోలుతో మార్కెట్ కంటే తక్కువ ధరలకు లభిస్తాయి. సహజసిద్ధమైన వ్యవసాయంతో పెట్టుబడి ఖర్చులు 15 నుంచి 20 శాతం వరకు తగ్గుతున్నాయి. ప్రభుత్వం అందజేసే సబ్సిడీలు, వనరులను ఉపయోగించుకొని వ్యవసాయం చేస్తున్నారు. జిల్లాలో 281 ఎఫ్పీజీలకు రూ.కోటి 29లక్షలు యంత్ర పరికరాల కోసం గ్రాంటుగా ఇచ్చాం. మహిళా రైతు సంఘం ద్వారా పరికరాలను తీసుకున్నాం
– లింగమ్మ, రాంరెడ్డిపల్లి, కులకచర్ల మండలం
తాము మహిళా రైతు సంఘంలో సభ్యులుగా చేరాం. 15 మందిమి కలిసి మహిళా రైతు సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ప్రభుత్వం ద్వారా 50వేల రూపాయలు వచ్చాయి. వాటి ద్వారా వ్యవసాయానికి సంబంధించిన పరికరాలను కొనుగోలు చేశాం. వ్యవసాయ పరికరాలను తాము వాడుకోవడంతో పాటు ఇతరులకు కూడా అద్దెకు అందజేస్తున్నాం. రైతు సంఘంలో ఇలాంటి సదుపాయం కూడా పొందుతున్నాం.
మహిళా రైతులు కలిసి వ్యవసాయం చేసుకోవడం ద్వారా పెట్టుబడి ఖర్చులు తగ్గగా.. మరోవైపు పంటలకు సంబంధించి అవసరమయ్యే యంత్ర పరికరాల కోసం ఎంపిక చేసిన ఎఫ్పీజీలకు డబ్బులు అందజేశారు. జిల్లావ్యాప్తంగా గత రెండేండ్లలో 10 మండలాల పరిధిలోని 281 ఎఫ్పీజీలకు రూ.కోటి 29లక్షల పైచిలుకు యంత్ర పరికరాల కోసం అందజేశారు. ఇందులో 44 ఎఫ్పీజీలకు ఒక్కోదానికి రూ.25వేల చొప్పున రూ.11లక్షలు, 237 ఎఫ్పీజీలకు ఒక్కోదానికి రూ.50వేల చొప్పున రూ.1,18,50,000 అందజేశారు. బంట్వారం మండలంలో 5 ఎఫ్పీజీలకు, బషీరాబాద్లో 12, బొంరాస్పేట్లో 34, దోమలో 3, దౌల్తాబాద్లో 24, కొడంగల్లో 12, కోట్పల్లిలో 8, కులకచర్లలో 128, మోమిన్పేట్లో 44, పెద్దేముల్లో 11 ఎఫ్పీజీలకు ఈ నిధులు అందజేశారు. ఈ నిధులతో సంబంధిత ఎఫ్పీవోలు పంటల సాగుకు అవసరమైన యంత్ర పరికరాలు కొనుగోలు చేసి వినియోగించనున్నారు. ఇందులో పవర్ టిల్లర్లు, రెండు మూడు రకాల పవర్ స్ప్రేయర్లు, పెట్టెలు, బోర్డులు, ఇతర వస్తువులు కొనుగోలు చేశారు. వ్యవసాయానికి సంబంధించిన యంత్ర పరికరాలను సాధారణ ధరలకే గ్రూపులోని సభ్యులు వినియోగించుకుంటారు. దీంతోపాటు ఇతర రైతులకు కూడా తక్కువ ధరలకే అద్దెకు ఇవ్వడం ద్వారా గ్రూపు ఆదాయం పెరుగుతుంది. ఇప్పుడిప్పుడే ఇతర రైతులకు కూడా వ్యవసాయ యంత్ర పరికరాలు అద్దెకు ఇస్తున్నారు. ఏ రైతుకు ఏ యంత్రం అద్దెకు ఇచ్చారు.. ఎంత డబ్బులు వచ్చాయనేది రిజిస్టర్లో ఎప్పటికప్పుడు నమోదు చేస్తారు.
వికారాబాద్ జిల్లా పరిధిలో 441 ఎఫ్పీజీలు ఏర్పాటు చేయగా 6764 మంది మహిళా రైతులు సభ్యులుగా ఉన్నారు. బంట్వారం మండలంలో 18 ఎఫ్పీజీలలో 270 మంది సభ్యులు, బషీరాబాద్లో 14-223, బొంరాస్పేట్లో 42-669, ధారూర్లో 7-105, దోమలో 6-90, దౌల్తాబాద్లో 24-389, కొడంగల్లో 18-272, కోట్పల్లిలో 10-150, కులకచర్లలో 133-2009, మర్పల్లిలో 5-76, మోమిన్పేట్లో 85-1289, నవాబుపేట్లో 9-135, పరిగిలో 5-75, పెద్దేముల్లో 11-213, పూడూరులో 11-165, తాండూరులో 23-355, వికారాబాద్లో 13-195, యాలాల్లో 7 ఎఫ్పీజీలలో 108 మంది మహిళా రైతులు సభ్యులుగా ఉన్నారు.