పరిగి, జూలై 5 : పరిగి నియోజకవర్గంలో విద్యారంగం అభివృద్ధికి ప్రభుత్వం రూ.100 కోట్లు వెచ్చిస్తుందని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి తెలిపారు. మంగళవారం వికారాబాద్ జిల్లా పరిగిలోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో ఇంటర్మీడియెట్, పదో తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను ఎమ్మెల్యే మహేశ్రెడ్డి ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రూ.7,500కోట్లతో మన ఊరు-మన బడి కింద పాఠశాలల్లో సదుపాయాలు కల్పిస్తున్నామన్నారు. ప్రతి పాఠశాలలో వసతులు కల్పించడంతోపాటు ఆంగ్ల మాధ్యమంలో విద్యాబోధన అందిస్తామని ఆయన తెలిపారు. పరిగి నియోజకవర్గంలోని 130 పాఠశాలల్లో మొదటి విడతలో వసతులు కల్పించినట్లు ఆయన తెలిపారు.
ప్రభుత్వం నాణ్యమైన విద్య అందించేందుకు గురుకులాలు నెలకొల్పిందని స్పష్టం చేశారు.
ప్రతి విద్యార్థి ఒక లక్ష్యం ఏర్పాటు చేసుకొని చదివితే దేన్నయినా సాధిస్తారని తెలిపారు. నియోజకవర్గంలోని కళాశాలలు, పాఠశాలల్లో అధ్యాపకులు, ఉపాధ్యాయుల మార్గనిర్దేశంలో చక్కగా చదవడం ద్వారా ఉత్తమ ఫలితాలు వచ్చాయన్నారు.
కార్యక్రమంలో ఎంపీపీ కరణం అరవిందరావు, దోమ, పరిగి జెడ్పీటీసీలు కొప్పుల నాగారెడ్డి, బి.హరిప్రియ, మార్కెట్ కమిటీ చైర్మన్ ఎ.సురేందర్, మున్సిపల్ చైర్మన్ ముకుంద అశోక్, మండలాల రైతుబంధు సమితి అధ్యక్షులు మేడిద రాజేందర్, పీరంపల్లి రాజు, మండల టీఆర్ఎస్ అధ్యక్షుడు ఆర్.ఆంజనేయులు, తదితరులు పాల్గొన్నారు.