నల్లగొండ జిల్లాలో దారుణం జరిగింది. ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో బాలింత ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలిని మునుగోడు మండలం చీకటిమామిడికి చెందిన మమత (27)గా గుర్తించారు.
మమత ఎనిమిది రోజుల క్రితం ప్రసవం కోసం నల్లగొండ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో చేరారు. అక్కడ మగబిడ్డకు జన్మనిచ్చారు. బుధవారం తెల్లవారుజామున వార్డు నుంచి బయటకు వచ్చిన ఆమె.. ఆసుపత్రిలోని పోస్టుమార్టం గది సమీపంలో చీరతో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మమత ఆత్మహత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.