నవాబుపేట, ఏప్రిల్ 6 : దేశానికి అన్నం పెట్టే స్థాయికి రాష్టం ఎదిగిందని.. అందుకు ప్రధాన కారణం తెలంగాణాలో రైతు ముఖ్యమంత్రిగా ఉండటమే అని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి పేర్కొన్నారు. బుధవారం నవాబుపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవం నవాబుపేటలోని లింగంపల్లి లక్ష్మారెడ్డి గార్డెన్లో జరిగింది. చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ సునీతారెడ్డి పాల్గొన్నారు. కమిటీ చైర్మన్గా ప్రశాంత్గౌడ్, వైస్ చైర్మన్గా కర్నం రఘుతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా నూతన పాలకవర్గానికి మంత్రి శుభాకాంక్షలు తెలుపుతూ ప్రసంగించారు.
నాడు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 5 వేల మెట్రిక్ టన్నులు పండే ధాన్యం నేడు 3 లక్షల 40 వేల మెట్రిక్ టన్నులకు చేరిందని మంత్రి తెలిపారు. 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ ఇస్తూ, ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉంచుతూ.. నకిలీలపై పీడీ యాక్ట్లు నమోదు చేస్తూ.. పెట్టుబడి సహాయంగా రైతు బంధు ఇస్తూ, రైతు వేదికల ద్వారా రైతన్నకు విలువైన సమాచారం, సూచనలు అందిస్తూ, ఎవరైనా రైతు చనిపోతే రూ.5లక్షలు వారి కుటుంబసభ్యులకు బీమా అందిస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ అని పేర్కొన్నారు. ప్రభుత్వ చర్యలతో రాష్ట్రంలో పంట దిగుబడి పెరిగి, సుభిక్షంగా, ఆకుపచ్చగా మారుతుంటే కేంద్రానికి కండ్లు మండుతున్నాయన్నారు. అడుగడుగునా ప్రభుత్వానికి అడ్డంకులు సృష్టిస్తూ ద్వేషం పెంచుకొని, కక్షగట్టి మన వడ్లు కొనబోమని అంటున్నారని పేర్కొన్నారు. బోర్లకు మోటార్లు వద్దు అని అంటే ఇతర రాష్టాల వలె చూడటంలేదు. తెలంగాణ రైతాంగంపై కేంద్ర వివక్షకు వ్యతిరేకంగా, పంజాబ్లో లాగా రెండు పంటలు కొనాలని డిమాండ్ చేస్తూ కేంద్రంతో యుద్ధం చేస్తున్నామన్నారు. ఈ ధర్మ పోరాటంలో రైతన్నలు ప్రభుత్వంతో కలిసి రావాలన్నారు. కేంద్రం యాసంగి వడ్లు కొనబోమని చెప్పినందున వరి వద్దు అని ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపునిస్తే అందుకు విరుద్ధంగా వరి వేయాలని రైతులను రెచ్చగొట్టిన బీజేపీ నేతలు.. నేడు రైతులు ఇబ్బందుల్లో ఉంటే ఎకడున్నారని ప్రశ్నించారు. బీజేపీ నాయకులను తెలంగాణ రాష్ట్రం నుంచి తరిమికొట్టాల్సిన అవసరం ఉందని మంత్రి సబితారెడ్డి పేర్కొన్నారు.
చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య మాట్లాడుతూ.. ఎన్నో ఏండ్లుగా డిమాండ్లో ఉన్న మారెట్ కమిటీని ముఖ్యమంత్రి కేసీఆర్ మంజూరు చేశారని తెలిపారు. మండల ప్రజలు, రైతుల తరఫున ముఖ్యమంత్రికి, మంత్రులకు ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. నూతన పాలకవర్గం బాగా పనిచేసి రైతుల మన్ననలు పొందాలని కోరారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ నవాబుపేట మండల అధ్యక్షుడు కందాడ నాగిరెడ్డి, యూత్ అధ్యక్షుడు శాంతకుమార్, టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు చిట్టెపు మల్లారెడ్డి, ఎంపీపీలు కాలె భవాని, విజయలక్ష్మి, జడ్పీటీసీ కాలె జయమ్మ, ఎంపీటీసీలు, సర్పంచ్లు, నూతన వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.