షాబాద్, జూలై 11: వానకాలం పంటల సాగు జోరందుకున్నది. వారం రోజులుగా వర్షాలు కురుస్తుండడంతో రైతులు వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు. రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా ఈ ఏడాది 5,24,333 ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగు చేయాల్సి ఉండగా… ఇప్పటివరకు 1,10,677 ఎకరాల్లో పంటలు సాగైనట్లు వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు. ఈ నెలఖారు వరకు విత్తనాలు నాటుకోవచ్చునని అధికారులు రైతులకు సూచిస్తున్నారు. అత్యధికంగా రైతులు పత్తి, కంది, మక్క జొన్న, జొన్న పంటలవైపే మొగ్గు చూపుతున్నారు. సీజన్కు ముందుగానే ప్రభుత్వం రైతుబంధు డబ్బులు అన్నదాతల ఖాతాల్లో జమ చేయడంతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎరువులు, విత్తనాలు కొనుగోలు చేశారు. కొన్ని రోజులుగా వర్షాలు సమృద్ధిగా పడుతుండడంతో రైతులు పొలం బాట పట్టారు.
1,10,677 ఎకరాల్లో సాగు..
ఈ ఏడాది జిల్లాలో పత్తిపంట 3,10,000 ఎకరాల్లో సాగు చేయాల్సి ఉండగా.. ఇప్పటికే 79,706 ఎకరాల్లో సాగు చేశారు. అలాగే మక్కజొన్న 22,000 ఎకరాలుగా ఉండగా 18,458 ఎకరాలు, జొన్న 28,500 ఎకరాలు కాగా 2,565 ఎకరాలు, కంది 1,12000 ఎకరాలు లక్ష్యంగా పెట్టుకోగా 7,845 ఎకరాలు, వరి 45,573 ఎకరాలకు గాను ఇప్పటికీ 1091 ఎకరాల్లో సాగు చేశారు. వీటితో పాటు ఇతర రకాల పంటలు కూడా సాగు చేశారు. ఈ నెల చివరి వరకు పంటలు సాగు చేసుకునేందుకు అవకాశం ఉందని వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వం రైతులకు పెట్టుబడి సాయం అందించడంతో రైతులకు వ్యవసాయంపై మరింత నమ్మకం పెరిగింది. గతంలో విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసేందుకు అప్పులు చేసేవారు.. లేదంటే డీలర్ల వద్ద అరువుకు కొనుగోలు చేసేవారు. దీంతో పంట పండిన తర్వాత అప్పులు పోగా.. ఏమి మిగిలేది కాదు. దీంతో వ్యవసాయం చేయాలంటే రైతులు వెనుకడుగు వేసేవారు. ఈ తరుణంలో ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుబంధు పథకం ద్వారా ఎకరాకు రూ.5వేలు పెట్టుబడి సాయం అందిస్తూ రైతులను ప్రోత్సహిస్తున్నారు. దీంతో అన్నదాతలకు అప్పుల బాధలు తప్పాయి.
వ్యవసాయ పనుల్లో బిజీబిజీ..
వర్షాలతో ప్రస్తుతం మక్కజొన్న, పత్తి పంటల సాగులో అన్నదాతలు బిజీ బిజీగా ఉన్నారు. కూలీల కొరతతో రైతులు ట్రాక్టర్ల సహాయంతో విత్తనాలు వేస్తున్నారు. జూన్ మొదటి వారంలో కురిసిన కొద్దిపాటి వర్షాలకు పత్తి, జొన్న పంటలు సాగు చేసిన రైతులు ప్రస్తుతం పంటలో కలుపు తీయడం, మందులు పిచికారీ, ఎరువులు వేయడం వంటి పనుల్లో నిమగ్నమయ్యారు.
పెట్టుబడి సాయంతో పంటలు సాగుచేస్తున్నాం..
వర్షాలు కురుస్తుండడంతో పంటలు సాగు చేస్తున్నాము. ప్రభుత్వం రైతుబంధు పథకం ద్వారా అందించిన పెట్టుబడి సాయంతో ఎరువులు, విత్తనాలు కొనుగోలు చేసి పంటల సాగు చేపడుతున్నాం. గతంలో అప్పులు చేసి పంటలు సాగు చేసేటోళ్లం. కానీ రైతుబిడ్డగా సీఎం కేసీఆర్ పంటలకు పెట్టుబడి ఇచ్చి రైతులకు అండగా నిలవడం సంతోషకరంగా ఉంది.
-సామ ప్రతాప్రెడ్డి, రైతు, ఎర్రొనిగూడ, షాబాద్)
ఈ నెలాఖరు వరకు సాగు చేసుకోవచ్చు..
జిల్లాలో ఈ ఏడాది వానకాలం 5,24,333 ఎకరాల్లో పంటలు సాగయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం వర్షాలు కురుస్తుండడంతో జిల్లాలో పంటల సాగు పనులు ఊపందుకున్నారు. ఆగస్టు నెలాఖరు వరకు వరిసాగు, ఈ నెలఖారు వరకు ఇతర పంటల సాగు చేపట్టవచ్చు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగుకుండా ముందుగానే అవసరమైన ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉంచాం.
-గీతారెడ్డి, రంగారెడ్డి జిల్లా వ్యవసాయశాఖ అధికారి